తెలంగాణ లో దొరలే రాజ్యమేలుతున్నారు.. అందులో ప్రాంతీయపార్టీగా, ఉద్యమ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి. గులాబీ పార్టీకి ఓనర్లు ఎవ్వరు ఉండరు అందరూ కిరాయిదారులేనట.. అది స్వయంగా టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించాడు. కానీ మేము కిరాయిదారులం కాదు.. ఓనర్లం అంటూ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వంటి వారు కామెంట్లు చేయడం, కేటీఆర్ దీనికి వ్యతిరేకంగా కామెంట్ చేయడం టీ ఆర్ ఎస్లో తిరుగుబాటుకు సూచనలు కనిపిస్తుండటం తెలంగాణ సీఎం కేసీఆర్కు కొత్త తలనొప్పి పట్టుకోగా, ఇప్పడు కేసీఆర్కు మరో ఉపద్రవం ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..
తెలంగాణలో మాకు తిరుగులేని నేతలం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న టీ ఆర్ ఎస్ నేతలకు బీజేపీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుందట.. అందుకే కేసీఆర్ కోటలు బీటలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు పార్టీలో దిక్కార స్వరాలు వినిపిస్తున్న తరుణంలో మరోవైపు బీజేపీ వేస్తున్న ఎత్తులతో టీ ఆర్ ఎస్ చిత్తయ్యే పరిస్థితి దాపురించింది. అందుకు నిదర్శనం టీ ఆర్ ఎస్ కు చెందిన 12మంది ఎమ్మెల్యేలు బీజేపీ కేంద్ర అధిష్టానంతో టచ్లో ఉన్నారట. ఈ విషయం తెలిసిన కేసీఆర్కు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుందనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్న తరుణం రావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రిపదవుల కోసం ఆశపడ్డారు. అయితే మంత్రివర్గ విస్తరణలో కొందరికే మంత్రి పదవులు రావడం, దీంతో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాశ పడిపోయారు. ఏకంగా మాజీ మంత్రులు జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య లాంటి వారు ఎంతో నిరుత్సాహంతో మునిగిపోయారు. ఇందులో జోగు రామన్న, నాయిని, రాజయ్యలు కేసీఆర్ వ్యవహారంపై దిక్కారస్వరాలు వినిపించగా, కడియం మాత్రం గుంభనంగా ఉండిపోయారు.
అయితే మంత్రి పదవుల కోసం ప్రయత్నించి విఫలమైన కొందరు ఎమ్మెల్యేలు తమలో తామే బాధపడి పోయి తమ భవిష్యత్ కార్యాచరణ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు వారు సిద్దమయ్యారట. ఇక బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ బీజేపీ ఎంపీ అర్వింద్తో కలవడంతో పాటు పార్టీ మారేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చేశారు. ఇక అహ్మద్తో పాటు సంతృప్తితో ఉన్న12 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు బీజేపీ అధిష్టానం ఓకే అంటే అప్పుడే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వేచిచూస్తున్నారట. సో ఈ పన్నేండు మంది ఎమ్మెల్యేలు ఎవరో తెలియక కేసీఆర్, పార్టీ ఆధిష్టానం ఆందోళనలో ఉందట.