ప్రతి ఇంట్లో ఆ ఇంటిని నడిపే, పోషించే వ్యక్తి ఒకరుంటారు.. ఒక్కో ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుండొచ్చు.. భర్త ఉద్యోగి అయితే.. భార్యకు.. భార్య ఉద్యోగి అయితే భర్తకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ ఇద్దిరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.. అనుకోకుండా ఉద్యోగి మరణిస్తే.. ఆ కుటంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతుంది.. సర్వీసులో ఉన్న ప్రతీ ఉద్యోగి బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తెలియజేయాలి. ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.15 వేలు అందిస్తారు. మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. మృతిచెందిన ఉద్యోగి ఎర్న్డ్ లీవ్లకు సంబంధించిన ఎన్క్యాష్మెంట్ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్క్యాష్మెంట్ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు.
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్గ్రేషియాను చెల్లిస్తుంది. ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు.
ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్నెస్ అలవెన్స్ (డీఏ) ను కుటుంబ పెన్సన్ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు.
విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తారు. ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్జీ పింఛన్రూల్స్కు అనుగుణంగా కుటుంబ పింఛన్ వర్తిస్తుంది. ఉద్యోగి తన విధి నిర్వహణలో చక్కగా పనిచేసి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అతని గ్రూపు ఇన్స్రెన్స్ను రెట్టింపు మొత్తంలో కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.