రాష్ట్రంలో వినూత్న పాలన దిశగా అడుగులు వేస్తున్నజగన్.. సంచలన పథకాలను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. తాను మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి విషయాన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తానని చెబుతున్న ఆయన ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. జగన్ ముందుకే సాగుతున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా వంటి కీలక పథకాలను భుజాలకెత్తుకున్న జగన్.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అతి తక్కువ సమయంలోమొత్తం 5 కోట్ల మంది ప్రజలకు లబ్ధి జరిగేలా ఓ వినూత్న పథకాన్ని తెరమీదికి తెచ్చారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఉద్యమం మాదిరిగా ఈపథకాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. అదే అందరికీ వెలుగును ప్రసరించే `వైఎస్సార్ కంటి వెలుగు` పథకం. ఏకంగా ఈ పథకానికి తాజా బడ్జెట్లో 560 కోట్ల రూపాయలను కేటాయించారు చిన్నా పెద్దా అందరూ నేటి సమాజంలోని ఆహారపు అలవాట్ల వల్ల కావొచ్చు, కాలుష్యం వల్ల కావొచ్చు.. కంటి చూపును పోగొట్టుకుంటున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం- దీంతో కంటికి సంబంధించి ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే వైద్యం ఖర్చు కూడా పెరిగింది. దీనిని గమనించిన గత సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఐ సెంటర్లు పెట్టాలని భావించారు. దీనికి సంబంధించి ఆయన అధ్యయనం కూడా చేయించారు చాలా నియోజకవర్గాల్లో ప్రారంభించారు కూడా . అయితే, ఆశించిన ఫలితాలు దీనికి కలగలేదు. ముఖ్యంగా గ్రామాల్లో కంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్న వారు కనిపిస్తున్నారు.
పట్టణాల్లో అయితే, ఏదొ ఒక వైద్యంతో నెట్టుకొస్తున్నారు. కానీ, పల్లె టూళ్లలో కంటి వైద్యం, కళ్లజోడు వంటి వాటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం కంటి వెలుగు పథకానికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వాలనినిర్ణయించుకున్నారు. అక్టోబరు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ పథకం ద్వారా నాలుగు దశల్లో రాష్ట్రంలోని మొత్తం ఐదు కోట్ల మంది ప్రజలకు కంటి వెలుగు ప్రసాదించాలని జగన్ నిర్ణయించుకున్నారు.
తొలిదశలో 70 లక్షల మంది విద్యార్థులకు ఈ పరీక్షలు చేయనున్నారు. తెలంగాణలో సంపూర్ణంగా సక్సె్స్ అయిన ఈ పథకం వల్లే మరోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారనే ప్రచారం తెలిసిందే. బహుశ ఆ దూర దృష్టికారణంగానే ఇప్పుడు జగన్ ఏపీలోనూ ఈ తరహా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. మరి ఇది ఏమేరకు వైసీపీకి సక్సెస్ రేటు ఇస్తుందో చూడాలి.