గత 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణాలో సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. సమ్మె చేయడానికి నెల రోజుల ముందుగానే నోటీసులు ఇచ్చారు. కానీ, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పండుగకు ముందు సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. సమ్మె సైరన్ మోగడంతో తెలంగాణాలో ప్రగతిరధ చక్రాలు ఆగిపోయాయి.
అప్పటి నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
దసరా పండుగకు ఏదోలా తెలంగాణ వ్యక్తులు తిరిగి హైదరాబాద్ కు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల స్ట్రైక్ ను దృష్టిలో పెట్టుకొని
దసరా సెలవులను పెంచింది. 11 రోజులుగా సమ్మె జరుగుతుండటంతో హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారించిన కోర్టు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. పండుగలు, స్కూల్ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి చురుకు అంటించింది.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయలేమని, అలా చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు కూడా ప్రభుత్వంలో విలీనం చేయమని కోరతాయని అడిషినల్ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందించింది. ప్రజల సమస్యలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించాలని, మిగతా విషయాలు అవసరం లేదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని చెప్పింది.
అంతేకాదు, ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించాలని హైకోర్టు సూచించింది. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరింది. మరి దీనిపై ఆర్టీసీ కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వం కూడా దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో సమ్మె తీవ్రతరం అవుతున్నది. ఈనెల 19 వ తేదీన సమ్మెకు పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే.