ఎన్నికలన్నా..,, ఓటుహక్కు వినియోగించుకోవడం అన్నా..,, ఉండే ఆసక్తి ఎంతో ప్రత్యేకం.. నేడు మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను నియమించగా.. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.. అలాగే దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కాగా ఈ ఎన్నికలలో ఓటు వేసేందుకు పలువురు బాలీవుడ్ తారలు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. హేమమాలిని, ఉర్మిళ మంటోడ్కర్, దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, ధర్మేంద్ర, అనిల్ కపూర్ వేర్వేరు పోలింగ్ బూత్ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ కొడుకు., బాలీవుడ్ ప్రముఖ హీరో., టాలీవుడ్ అల్లుడు రితేష్ దేశ్ముఖ్ ఆయన భార్య జెనీలియా, తల్లి వైశాలి దేశ్ముఖ్ తో సహా ఓటు వేసిన అనంతరం తన నివాసంలో.. తండ్రి చిత్ర పటం ముందు భార్య, తల్లితో కలిసి ఫొటో దిగారు.
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, అతని భార్య షర్మిల ఠాక్రేలతో కలిసి శివాజీ పార్క్లోని బాలమోహన్ విద్యామందిర్ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, అతని సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రేలు బాంద్రా(తూర్పు)లో సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఆదిత్య ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అయితే బాంద్రా(పశ్చిమ) పోలింగ్ బూత్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి, కుమారుడు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సతీమణి అమృత, తల్లి సరిత నాగ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేసారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ పోలింగ్ బూత్కి సైకిల్పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని కోరారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన మనవరాలు, అల్లుడితో పోలింగ్ బూత్ కొచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముంబైలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సమయంలో ఓ వృద్దుడు ఈ రోజు ఉదయం నుంచి స్మృతి కోసం పోలింగ్ బూత్ వద్ద ఎదురుచూస్తున్నాడనే విషయం తెలుసుకున్న ఆమె పోలింగ్ బూత్ వద్దకు రాగానే ఆయన్ను కలిసి.. అప్యాయంగా పలకరించారు.