అశ్వత్థామ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తున్న పేరు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక నాయకుడు.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు.. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాల్సిందే అని కేసీఆర్ తో కొట్లాడుతున్న వ్యక్తి.. 47 వేల మంది కార్మికులను ఏకతాటిపై నడుపుతున్న వ్యక్తి.. దాదాపు 20 రోజులు కావస్తున్నా.. సమ్మెకు పరిష్కారం లభించడం లేదు.


దీనికితోడు కేసీఆర్ తాజాగా ఇక ఆర్టీసీయే ఉండదు పొమ్మంటున్నాడు.. ఆర్టీసీ చరిత్ర సమ్మెతోనే ముగిసిపోయిందంటున్నాడు.. ఇక ఈ భూగోళంలో ఆర్టీసీని కాపాడేవాడెవడూ లేడంటున్నాడు.. ఆర్టీసీ కార్మికులు తమ కాళ్లు తామే నరుక్కున్నారని ఏకంగా సీఎం కామెంట్ చేశాడు. మరి ఈ పరిస్థితుల్లో అశ్వత్థామరెడ్డి ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.


ఈ అశ్వత్థామరెడ్డి ఇప్పుడు.. కేసీఆర్ కు దీటుగా గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ.. ఈయనే ఒకప్పుడు కేసీఆర్ పెంచిన నాయకుడే. గతంలో ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉండేది. ఇప్పటికీ ఉంది. కానీ దాని నాయకత్వం ఏపీకి చెందినవారు ఉండేవారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణకు కూడా సొంత యూనియన్ ఉండాలన్న ఉద్దేశ్యంతో అశ్వత్థామ రెడ్డి తెలంగాణ మజ్దూర్ యూనియన్ అంటూ సొంత కుంపటి పెట్టాడు.


తెలంగాణ జోరులో అది సక్సస్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన కేసీఆర్ అనుయాయుడిగానే ఉంటూ వచ్చాడు. అయితే ఓ ఏడాది నుంచి అశ్వత్థామరెడ్డికి టీఆర్ఎస్ కు సంబంధాలు చెడిపోయాయి. ఆర్టీసీలో యూనియన్ నాయకులను బోర్డు మెంబర్లుగా తీసుకోవడం ఆనవాయితీ.. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఆ పని చేయలేదు. దీంతో అశ్వత్థామరెడ్డికి కేసీఆర్ పై అసంతృప్తి పెరిగింది.


గత ఎన్నికల సమయంలోనూ అశ్వత్థామ రెడ్డికి ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించాడు. కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని భావించాడు. కానీ ఏదీ రాలేదు. దీంతో అశ్వత్థామరెడ్డికి కేసీఆర్ పై పీకల దాకా కోపం ఉంది. అదే సమయంలో త్వరలో యూనియన్ల ఎన్నికలూ ఉన్నాయి. అన్నీ కలిపి సమ్మెకు దారి తీశాయి. మరి ఇప్పుడు అశ్వత్థామరెడ్డి ఏంచేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: