తమిళనాడులో ఈ నెల 25న ఇంటి వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ రెండేళ్ల సుజిత్ విల్సన్ మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి బోరుబావిలో నరకం అనుభవించిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 


సుజిత్ మృతదేహాన్ని బోరుబావిలో నుంచి వెలికితీయడానికి మూడు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీం శాయశక్తులా ప్రయత్నించినా ప్రయత్నం లేకపోయింది. బోరుబావిలో పడ్డ సుజిత్ ను వెలికితీసే సమయానికి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ ను నిలిపివేశారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. దాదాపు 80 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్, మద్రాస్ ఐఐటీ నిపుణులు, డాక్టర్లు ఈ ఆపరేషన్ లో భాగమయ్యారు. ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే బాలుడు ఎంత లోతులో ఉన్నాడో కనిపెట్టేందుకు మద్రాస్ ఐఐటీ నిపుణులు శ్రమించారు. సమాంతరంగా తవ్విన గోతిని కూడా తవ్వారు. డాక్టర్లు ఆక్సిజన్ పైపులు బావిలోపలికి పంపించి బాలుడికి ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు. రోజులు గడిచిపోవడం, ఆక్సిజన్ లెవల్స్ సరిగా అందకపోవడంతో సుజిత్ ను ప్రాణాలతో కాపాడుకోలేకపోయారు.

 


సుజిత్ ప్రాణాలతో తిరిగిరావాలని దేశ ప్రధాని మోదీ సైతం కోరుకున్నారు. ఎందరో ప్రముఖులు, సినీ ప్రముఖులు సైతం సుజిత్ క్షేమాన్ని కోరుకున్నారు. పరిస్థితులు అనుకూలించక చిన్నారి మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడ ఎవరి తరం కావట్లేదు. అధికారులు వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా బోరు బావి తవ్వకాలు ఆగడం లేదు. తవ్విన బావులు నిరుపయోగం అయితే వాటిని పూడ్చకపోవడం ఇటువంటి దుర్ఘటనలకు తావిస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: