లాటరీలో ఒక బహుమతి వచ్చింది, అది పంపేందుకు సర్వీస్ చార్జీలు చెల్లించాలంటూ మెయిల్స్, మెసేజ్ లు వచ్చేవి. అలా వచ్చిన మెసేజ్‌లకు స్పందించిన వారు నగదు పంపించి మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి నేరాల పై కాస్త అవగాహన రావడంతో సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు, ఎత్తులకు  తెగబడుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు వేయమంటే అనుమానం వస్తుందని పది వేళా నుంచి ఇరవై వేల వరకు మాత్రమే చెల్లిస్తే చాలని ఎరవేసి బ్యాంకు ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం పెద వడ్లపూడికి చెందిన అర్జున రావు కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఫోన్ వచ్చింది. మీకు పార్శిల్ వచ్చింది, డెలివరీ ఇచ్చేందుకు ఒక మెసేజ్ పంపిస్తాం, దాని ద్వారా కేవలం పదకొండు రూపాయలు చెల్లిస్తే పార్శిల్ ఇస్తామని తెలిపారు. చిన్నమొత్తమే కదా అని మెసేజ్ లింక్ ద్వారా వారు అడిగిన 11 రూపాయలు చెల్లించాడు. అంతే కొద్ది సేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి 70 వేల రూపాయలు మాయమయ్యాయి. వేరే ఖాతాకు బదిలీ చేసినట్లు ఫోన్‌ కు మెసేజ్ రావడంతో అర్జున రావు కంగుతిన్నాడు.


దీనితో వెంటనే తనకు ఫోన్ వచ్చిన నంబర్‌ కు తిరిగి కాల్ చేశాడు. ఆ నంబర్ పనిచేయక పోవడంతో తాను మోసపోయానని గ్రహించి వేంటనే పోలీసులను ఆశ్రయించాడు సదరు వ్యక్తి. లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారానే ఖాతాలోని నగదు అపహరించినట్లు విషయం తెలుస్తోంది. దీనితో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పై ఏదైనా మెసేజ్ లింక్స్‌ పై క్లిక్ చేసే ముందు కాస్త ఆలోచించుకోవడం బెటర్ అని సైబర్ పోలీసులు తెలుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: