రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక దుండగుడు తహసీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం తహసీల్దార్ కార్యాలయంలోనే జరిగింది. ఈ ఘటనలో తహసీల్దార్ విజయ సజీవ దహనమయ్యారు. మంటలు అదుపు చేయటానికి ప్రయత్నించిన ఇద్దరు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.  
 
ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక దుండగుడు తహసీల్దార్ విజయతో మాట్లాడాలని చెప్పి తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించాడని ఆ తరువాత తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను విజయపై పోసి నిప్పంటించాడని తెలుస్తోంది. నిప్పంటించిన దుండగుడికి సైతం గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికులు దుండగుడిని పట్టుకోవటానికి ప్రయత్నించగా దుండగుడు తప్పించుకొని పారిపోయాడు. 
 
తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది దుండగుడిని చూడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. భూవివాదానికి సంబంధించి విజయపై దాడికి పాలడ్డాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. గాయాలపాలయిన సిబ్బందిని సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
గాయాలపాలయిన  సిబ్బంది పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. దుండగుడు నిప్పు అంటించగానే విజయ కార్యాలయం నుండి కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మంటలు శరీరమంతటా వ్యాపించటంతో విజయ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పోలీసుల దర్యాప్తులో ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దుండగుడు తనపై కూడా పెట్రోల్ పోసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆ వ్యక్తి  ఎందుకు  పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: