తెలంగాణ సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్
హత్య కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. హంతకుడు ఒక్కసారిగా విజయారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లి 30 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడుతూ ఆ తర్వాత ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న
పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పంటించాడు. విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని సురేశ్ ముదిరాజ్గా పోలీసులు గుర్తించారు.
ఇక విజయారెడ్డి టాపిక్ ఇప్పుడు
తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ సంఘటనతో ఉద్యోగులు అందరూ ఒక్కొక్కరుగా తాము విధులు చేయలేమని బహిష్కరిస్తున్నారు. ఇక విజయారెడ్డి విషయానికి వస్తే నల్లగొండ
జిల్లా నకిరేకల్ ఆమె సొంతూరు. ఆమె తండ్రి లింగారెడ్డి. కొండారంలోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సి.లింగారెడ్డి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం ఆమె అత్తగారి ఊరు.
భర్త సుభాష్ రెడ్డి
డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే ఆమె పట్టుదలతో గ్రూప్ 2 పరీక్షలు రాసి ఈ ఉన్నత ఉద్యోగం సాధించింది. ఇక కొద్ది రోజులుగా భూవివాదంలో
సురేష్ విజయారెడ్డిపై కక్షకట్టినట్టు తెలుస్తోంది.
ఇక కొత్తగా ఏర్పడిన అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి విజయారెడ్డే తొలి తహసీల్దార్.
సురేష్ ముందుగా
తహశీల్దార్తో మాట్లాడాలంటూ పర్మిషన్ తీసుకుని విజయారెడ్డి గదిలోకి వెళ్లాడు. లంచ్కు వెళ్లాల్సిన ఆమె ఆగిపోయి అతడితో మాట్లాడారు. అరగంట తర్వాత ఆమెతో వాగ్వివాదానికి దిగడంతో పాటు తలుపులు మూసేసి విజయారెడ్డిపై దాడిచేశాడు. అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేశ్ బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన
సురేష్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని... తనకు మంటలు అంటుకున్నాయని చెపుతూ చొక్కా విప్పేసి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు. కాలిన గాయాలతో పోలీస్ స్టేషన్ ముందు పడిపోయాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.