ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలగపోతే సహించేది లేదని పార్టీ నాయకులను హెచ్చరించారు. తనకు సన్నిహితుడైన మోహన్ బాబునే సస్పెండ్ చేశానని గుర్తు చేశారు. దీంతో చంద్రబాబుపై ఫైర్ అయ్యారుసీనియర్ నటుడు మోహన్ బాబు.  చంద్రబాబు తన మనసు గాయపరిచారంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


 "చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు.

అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!" అంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లను చూస్తుంటే మోహన్ బాబు బాగానే హర్ట్ అయినట్టున్నారు.


చంద్రబాబుపై మోహన్ బాబు గతంలోనూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ చేతిలోంచి అన్యాయంగా అధికార పగ్గాలు లాక్కున్నారంటూ మోహన్ బాబు విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: