తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోరింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మంగళవారం కూడా విచారణ కొనసాగింది.
కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఈ సమయంలో సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పేందుకు అనేక విధాలా ప్రయత్నించింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ కోర్టుకు తెలిపారు.
అయితే.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో మరోసారి కలుగ జేసుకున్న సీనియర్ న్యాయవాది.. 2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. ఆ జీవోను పరిశీలించిన హైకోర్టు.. ఆ జీవో ఆరునెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని... చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ విషయంపై సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు... సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాకే ముందుకు వెళ్తామని తెలిపింది. దీనిపై ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. సమ్మె విరమణ కోసం ఇప్పటికే తాము ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశామని.. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశించలేదని తెలిపింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.