ఇసుక కొరత పై గురువారం విజయవాడ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష తలపెట్టిన నేపధ్యం లో ఆ పార్టీకి, వైకాపా నాయకత్వం ఊహించని విధంగా షాక్ మీద షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది . మన శాండ్ వెబ్ సైట్ ను విశాఖకు చెందిన బ్లూ ప్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హ్యాక్ చేసిందని అనుమానిస్తూ , స్థానిక పోలీసుల సహకారంతో, సి ఐ డి అధికారులు సోదాలు నిర్వహించారు . ఈ సంస్థ కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంబంధాలు ఉన్నాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు .
ఇక తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను తమవైపు తిప్పుకోవడం లో వైకాపా నాయకత్వం సక్సెస్ అయింది . గత కొంతకాలంగా అవినాష్ , టీడీపీ ని వీడనున్నారని ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ , ఆయన ఖండిస్తూ వచ్చారు . అయితే చంద్రబాబు, ఇసుక కొరత పై దీక్ష చేపట్టిన రోజునే , అవినాష్ ను పార్టీలో చేర్చుకునే విధంగా పథకరచన చేసి వైకాపా నాయకత్వం సఫలీకృతమయినట్లే కన్పిస్తోంది . గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షం లో అవినాష్, వైకాపా లో చేరడం దాదాపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి .
ఇక ఇసుక స్టాక్ యార్డ్ ఫుల్ గా ఉన్నప్పటికీ , మన శాండ్ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి , బ్లూ ప్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ ఇసుక కృతిమ కొరత సృష్టించే ప్రయత్నాన్నిచేసిందన్న ఆరోపణలతో సి ఐ డి సోదాలు నిర్వహించడం , అదే సమయం లో ఆ సంస్థకు నారా లోకేష్ కు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారాన్ని వైకాపా నాయకత్వం సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . అయితే ఆ సంస్థ తో తనకు ఎటువంటి సంబంధం లేదని లోకేష్ ఖండించారు .