రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ ఇటీవల పలుసార్లు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరిస్తుందని, ఈ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు.


అమరావతితో పాటు, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫారసులు చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు సారథ్యంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఏకసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి పలువురికి నోటీసుల చేసింది.


కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, సీఆర్‌డీఏ కమిషనర్‌, ఛైర్మన్‌, పురపాలక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌రావు, కమిటీ సభ్యులు ఈ నోటీసులు జారీచేసినవారిలో ఉన్నారు. పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించి న్యాయమూర్తి.. తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేశారు.


నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 585ను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికిచెందిన సీహెచ్‌ శివలింగయ్య, సీహెచ్‌ రామారావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.మంత్రి బొత్స ప్రకటనలతో.. రాజధానిపై గందరగోళం నెలకొంది.


పది రోజుల కిందట రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. రాజధానిపై ప్రభుత్వం త్వరలో ప్రకటన చేస్తుందని బొత్స తెలిపారు. ఫలానా తేదీలోగా అని స్పష్టంగా చెప్పనప్పటికీ.. త్వరలోనే ఆ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కమిటీకి సర్కారు ఆరు వారాల గడువు ఇచ్చిందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని బొత్స చెప్పడం ద్వారా.. రాజధాని మార్పు ఖాయమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ రాజధానిని అమరావతిలోనే ఉంచినా.. వికేంద్రీకరణకు జగన్ సర్కారు మొగ్గు చూపే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: