ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్లు హాట్ టాపిక్స్ గా మారుతున్నాయి. కొడాలి నానికి కాస్త నోరు ఎక్కువ. అందులోనూ మహా నాటు.. ఆయనకు కోపం వచ్చిందంటే.. ఆయన నోటి నుంచి ఆణిముత్యాలే వస్తాయి. నీయమ్మా మొగుడు చెప్పాడా.. అంటూ సింపుల్ గా కడిగేయగలరు ఆయన. అందులోనూ.. వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి.

 

ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అలాంటి కొడాలి నాని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. టీడీపీ వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు.టీడీపీ తనకు చేసింది ఏమి లేదని.. తనకు, వల్లభనేని వంశీకి కూడా రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అని కొడాలి నాని స్పష్టం చేశారు.

 

అంతే కాదు జూనియర్ ను ఆకాశానికెత్తేశారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా లోకేష్ లాంటి దద్దమ్మ వల్లే టీడీపీ నాశనం అవుతోందని కొడాలి నాని ధ్వజమెత్తారు. సెల్ఫ్ డిక్లరేషన్ అంశంపై కూడా కొడాలి నాని స్పందించారు. తన పేరులోనే వెంకటేశ్వర అని ఉందని .. శ్రీవారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

 

కేవలం తాను అన్నది చంద్రబాబును అని.. ఇక ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు.. అంతేకాకుండా ముగించిన తర్వాత కూడా జగన్ తిరుపతి వెళ్లారని.. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని కొడాలి నాని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎన్నోమార్లు పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. ఇలా అనేక సార్లు వైఎస్ కుటుంబం తిరుపతి గుడికి వెళ్లి.. వస్తుండటం ఆనవాయితీగా జరుగుతోంది. అప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ అంశం.. ఇప్పుడెందుకు వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: