విజయవాడలో టీడీపీ బలహీనపడిపోయిందా...? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు వినపడుతుంది. 2014 ఎన్నికల్లో విజయవాడ పరిధిలో రెండు సీట్లను తెలుగుదేశం గెలిచింది. ఇక నగరాన్ని ఆనుకుని ఉన్న గన్నవరం, పెనమలూరు స్థానాలను కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. మైలవరం సీటుని కూడా టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా బలహీనపడటమే కాదు, అసలు పార్టీ క్యాడర్ కూడా భయపడే విధంగా ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కేవలం విజయవాడ తూర్పు స్థానాన్ని మాత్రమే తెలుగుదేశం గెలుచుకుంది.
మిగిలిన స్థానాల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపించినా విజయాన్ని అందుకోలేకపోయింది టీడీపీ. ఇప్పుడు విజయవాడలో పార్టీ మరింత బలహీనపడింది. ఎంపీ వర్గం, మాజీ ఎమ్మెల్యేల వర్గాలు, ఎమ్మెల్యే వర్గాలు అంటూ వార్డ్ కి ఒక వర్గం తయారు అయింది. కేశినేని నానితో ఏ ఇబ్బంది క్యాడర్ కి లేకపోయినా మాజీ ఎమ్మెల్యేల తీరుకి క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఇటీవల దేవినేని అవినాష్ పార్టీ మారారు. దీనితో ఆయన వర్గం భారీగా ఉన్న తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో క్యాడర్ కూడా ఆయన వెంట నడుస్తున్నాయి.
ఇక సెంట్రల్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది... వాళ్ళల్లో రంగా అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వారు పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. ఇక పెనమలూరులో బోడే ప్రసాద్ వ్యతిరేకతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైలవరంలో ఉమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. అసలు ఉమా తీరుతోనే జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ వైసీపీలోకి వెళ్లిపోతోంది.
గన్నవరం నుంచి వంశీ కూడా మారడంతో రామవరప్పాడు రింగ్ నుంచి కూడా క్యాడర్ ఆయన వెంట వెళ్లే అవకాశం ఉంది. ఈ విధంగా ఎటు చూసినా సరే విజయవాడలో టీడీపీ బలహీనమే. గతంలో వైభవం చూపించిన ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా బలహీనపడిపోయింది.