ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన అమరావతిలో పర్యటించి అక్కడ తమ హయాంలో ఏవేమీ నిర్మాణాలు జరిగాయి. ఇంకా మిగిలిన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయిఅనే దానిపై ఆరా తీయనున్నారు. ఇక బాబు పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని ఓ వర్గం రైతులు బాబుపై తీవ్రంగా మండిపడ్డారు.
సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి..గత టీడీపీ ప్రభుత్వం హయంలో మోసాలు జరిగాయని చెప్పారు. చంద్రబాబు మూడేళ్లలో ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అలాగే తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్లో పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తమకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియ లేదన్నారు.
ఇక టీడీపీ నేతలు ఎవరు అమరావతికి భూములు ఇవ్వలేదని, పైగా రాజధాని ప్రాంతంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 9 వేల ఎకరాల వరకు కొన్నారని ఆరోపణలు చేశారు. అసలు గత ఐదేళ్లు భూములు తీసుకుని అభివృద్ధి చేయకుండా, గ్రాఫిక్స్ చేసి తమని మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, మాజీ మంత్రి నారాయణలు తమని నిలువనా ముంచేశారన్నారు. ఇక అప్పుడు రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటిస్తే పసుపు నీళ్ళు చల్లారని, ఇప్పుడు బాబు పర్యటిస్తే ఏ నీళ్ళు చల్లాలని ప్రశ్నించారు.
అయినా రాజధాని పేరుతో తమని మోసం చేసిన బాబు..ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని అడిగారు. తమకు క్షమాపణ చెప్పి బాబు రాజధాని పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. ఏదేమైనా అమరావతి రాజధాని భూముల విషయంలో విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా తమకు రైతుల మద్దతు ఉందని ముందు నుంచి డప్పు కొట్టు కుంటోన్న టీడీపీ నేతలు ఇప్పుడు రైతుల నుంచి వస్తోన్న ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి వీటిపై బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో ? చూడాలి.