మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత గవర్నర్ బదిలీ అంశం తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే గవర్నర్ కలసిన కొద్ది సమయంలోనే ఈ వార్తలు బీజేపీ, అధికార వర్గాల్లో జోరందుకోవడం గమనార్హం. ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియక ముందే గవర్నర్ కోశ్యారి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
అంతేకాక ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఓ లేఖను గవర్నర్కు ఆధారంగా చూపడంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాలివ్వడం.. ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. దీన్ని సవాలు చేస్తూ శివసే, ఎన్సీపీలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లోగా బలం నిరూపణ చేసుకోవాలని గడువు ఇస్తూనే గవర్నర్ అధికారాలను ప్రశ్నించింది. బల నిరూపణకు ఒక రోజు ముందే ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఈ పరిణామాలతో కేంద్రం బద్నామ్ కావడంతో పాటు ఎన్సీపీ, శివసేనకు ప్రజల నుంచి సానుభూతి లభించడం గమనార్హం.
ఇప్పుడు గవర్నర్ మార్పు మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కోశారి స్థానంలో రాజస్థాన్ గవర్నర్ కలరాజ్ మిశ్రా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వంలో ఉన్నత వర్గాల ద్వారా విశ్వసనీయంగ తెలుస్తోంది. కలరాజ్ మిశ్రా ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన అనుభవజ్ఞుడైన నాయకుడైన ఆయన రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగాధిపతిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే కోశ్యారీ కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం గమనార్హం.
రెండు రోజుల క్రితమే తన సంపాదకీయ మౌత్ పీస్ 'సామానా'లో, శివసేన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై తీవ్రంగా దాడి చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రశ్నలు వేస్తూ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేసిన ప్రాతిపదికను గవర్నర్ను అడిగారు. ఈ కేసులో సమర్పించిన పత్రాలు నకిలీవని సంపాదకీయం ఆరోపించింది మరియు మొత్తం సంఘటనను 'చాణక్య చతురై' లేదా గవర్నర్ తెలివిగా పేర్కొనాలా అని కడిగేసింది.