ఉన్నత విద్య చదువుకునే వారికి శుభవార్త. ఇకపై ఏపీ ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద వంద శాతం ఫీజురియంబర్స్‌మెంట్‌. సమాజంలోని అన్ని వర్గాలకు సంవత్సరానికి రూ. రెండున్నర లక్షల ఆదాయం ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఫీజురియంబర్స్‌మెంట్‌ చెల్లించాలని మంత్రి మండలి తీర్మానం చేసింది.

 

ఈ జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఏటా రూ. 3400 కోట్లు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదించింది. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు మాత్రమే వెచ్చించింది. ఈ ప్రభుత్వం రూ.3400 కోట్లు వందశాతం ఫీజురియంబర్స్‌మెంట్‌కు ఖర్చు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన.. ఈ రెండు పథకాలకు రూ.5700 కోట్లు ఖర్చు చేయాలని తీర్మానం చేయడం జరిగింది.

 

ఈ పథకం అందుకోవాలంటే.. విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం పరిమితిని రూ. రెండున్నర లక్షలుగా నిర్ణయించారు. అదే రైతులైతే.. పది ఎకరాల వరకు మాగాణి పొలం ఉన్నా.. 25 ఎకరాల వరకు మెట్ట పొలం ఉన్నా.. రెండు కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ పారిశుద్ధ్య పనిచేసే ప్రతి కుటుంబానికి ఫీజురియంబర్స్‌మెంట్‌ సంపూర్ణంగా జరుగుతుంది.

 

ఆధునిక సమాజంలో అంతరాలను తొలగించేది.. సమానత్వాన్ని పంచేది.. నలుగురిలో తలెత్తుకుని జీవించేలా చేసేది విద్య మాత్రమే. అందుకే అణగారిన, బడుగు పిల్లలకు కూడా ఉన్నత చదువులు అందించాలనే సదాశయంతో జగన్ సర్కారు ఈ పథకం కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. కొందరు దీన్ని రాష్ట్ర ఖజానాను పప్పుబెల్లాలుగా పంచడం అని వర్ణిస్తున్నా.. విద్యపై రాష్ట్రం పెట్టే పెట్టుబడి తిరిగి రాష్ట్రానికి అందుతుంది.. కాకపోతే దీర్ఘకాలంలో అన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: