ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.. అయితే, ఇప్పుడు ఉల్లి మేలు చేయడం కంటే జేబులకు చిల్లులు పెడుతున్నది. ఉల్లి ఏస్థాయిలో ఇబ్బందులు పెడుతుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఉల్లికోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి ధరలు దేశంలో ఇప్పుడు దారుణంగా మారిపోయాయి. కిలో ఉల్లిధర 100 కి చేరింది. ఇంతపెట్టి ఉల్లిపాయలు కొనడం కంటే మానుకోవడం మేలు అని చెప్పి ప్రజలు అంటున్నారు.
దేశంలో ఉల్లి ట్రెండ్ నడుస్తున్నది. ఎవరిదగ్గరైతే ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటాయో వారే కోటీశ్వరుడు. అందుకే ఉల్లికోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఉల్లిని బంగారం కంటే మిన్నగా చూసుకుంటున్నారు. దేశంలో దొంగలకు కొదవలేదు. దొరికినంత దోచుకొని పోతున్నారు. దొంగతనం చేయడం అంటే వీరికి ఎంతో సరదా. ఒకప్పుడు డబ్బు, నగలు దొంగతనం చేసేవారు.
కానీ, ఇప్పుడు ఆ దొంగలు కూడా రూటు మార్చారు. రూటు మార్చి ఉల్లిపై పడ్డారు. ఉల్లి కనిపిస్తే చాలు మెల్లిగా లేపేస్తున్నారు. దోచేస్తున్నారు. కనిపించకుండా మాయం చేస్తున్నారు. ఇలాంటి దొంగతనాలే దేశంలో ఎక్కువయ్యాయి. సోమవారం రాత్రి బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నపూర్ ఏరియాలో ఓ షాపులో దొంగలు పడి 50వేల రూపాయల విలువచేసే ఉల్లిని ఎత్తుకెళ్లారు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బును మాత్రం ముట్టుకోలేదు.
ఇక ఇదిలా ఉంటె, ఈనెల 11 వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 40 టన్నులతో కూడిన ఉల్లి లారీ ఉత్తరప్రదేశ్ లోని ఘోరక్ పూర్ కు బయలుదేరింది. అలా బయలుదేరిన లారీని మధ్యలో దొంగలు దోచేశారు. మాములుగా దొంగలు సరుకును, దాంతో పాటుగా లారీని దోచుకెళ్ళాలి. కానీ, ఈ దొంగలు తెలివిగా ఉల్లిని మాత్రమే దోచుకెళ్లి లారీని అక్కడే వదిలేశారట. ఈ న్యూస్ ఇప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. లారీని వదిలేసి ఉల్లిని దోచుకెళ్లడం ఏంటో అని తెగ సందేహిస్తున్నారు. అక్కడే కాదు దేశంలో చాలా ప్రాంతాల్లో ఉల్లిపాయ దొంగలు ఎక్కువయ్యారు.