సీఎం జగన్ మరో సారి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారందరికీ 3 జతల యూనిఫారాలు, జత బూట్లు, సాక్సులతో కూడిన కిట్లు ,స్కూలు బ్యాగు, నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, అందించాలని నిర్ణయించారు . వీటన్నిటిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి సమకూరుస్తారు.
గతంలో ప్రకటించిన దానికంటే కిట్లో అదనంగా స్కూలు బ్యాగు, నోట్ బుక్స్ చేర్చారు.యూనిఫారాల కుట్టుకూలీ, జత షూస్, సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్నారు. మిగిలిన వాటిని కిట్ల రూపంలో అందిస్తారు. ఈ గురువారం సీఎం వైఎస్ జగన్ పాఠశాల విద్య, మధ్యాహ్న భోజన పథకంపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.వీటిని విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభించేనాటికి అందించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల కోసం వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా నూతన పాఠ్యప్రణాళిక రూపకల్పనపై అధికారులతో చర్చించారు. తొలుత బ్రిడ్జి కోర్సును ఆంగ్ల మాధ్యమంలోకి పిల్లలను సన్నద్ధం చేసేందుకు నిర్వహిస్తామని అధికారులు వివరించారు. బ్రిడ్జి కోర్సులు విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల రోజుల పాటు విద్యార్థులకు ఇస్తామని అధికారులు ప్రతిపాదించగా దీనిని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. టీచర్లకు శిక్షణ, పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో ప్రజంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఈ నేపధ్యం లో బ్రిటిష్ కౌన్సిల్ ఉపాధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల మాధ్యమంలో బోధన తదితర అంశాల్లో సహకారం అందిస్తుందని వివరించారు. చికాగో యూనివర్శిటీ గణితాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామి కానుందని చెప్పారు. విద్యావ్యవస్థలో తెస్తున్న మార్పులతో దేశమంతా ఏపీ వైపు చూస్తోందన్నారు.సీఎం మధ్యాహ్న భోజనం నాణ్యత దెబ్బ తినకూడదని సమీక్ష సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘మధ్యాహ్న భోజన బకాయిలు లేకుండా చూస్తున్నాం. ఈ పథకంలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కల్పించాలి . నాడు –నేడు కార్యక్రమం, స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.