గత టీడీపీ ప్రభుత్వంలో వరుసగా ఐదేళ్లపాటు మంత్రిగా చక్రం తిప్పిన బీసీ నాయకుడు కొల్లు రవీంద్రకు ఇప్పుడు కేడర్ భయం పట్టుకుందా? ఆయన పిలిచినా కూడా కేడర్ సగానికి సగం మంది కనీసం మొహం చూపించేందుకు కూడా ఇష్టపడడం లేదా? దీంతో ఇటీవల గ్రాండ్గా నిర్వహించాలని అనుకున్న ఓ కార్యక్రమాన్ని ఏకంగా కొల్లు రద్దు చేసుకున్నారా? అంటే ఔననే అంటు న్నారు కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు.
టీడీపీలోయువ నాయకుడిగా ఎదిగిన మత్స్యకార వర్గానికి చెందిన కొల్లుకు చంద్రబాబు 2014లో మచిలీపట్నం టికెట్ ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. ఆ వెంటనే బీసీ కోటాలో కొల్లుకు మంత్రి పదవి కూడా దక్కింది. అయితే, ఆది నుంచి కూడా కొల్లు వివాదాల చుట్టూతానే తిరిగారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో జరిగిన నకిలీ మద్యం మృతుల ఘటనకు ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చింది.
ఆ తర్వాత మత్స్యకార వర్గాలకు ప్రభుత్వం నుంచి పింఛన్ను మంజూరు చేయిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆయన సానుకూ లం చేసుకోలేక పోవడం, మచిలీపట్నం పోర్టు వివాదం వంటివి కొల్లుకు ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో ఎక్సైజ్ మంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పించి మరో శాఖను అప్పగించారు. దానిలోనూ ఆయన దూకుడు చూపించలేక పోయారు. ముఖ్యంగా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్థానిక టీడీపీ కేడర్ను పట్టించుకోలేదనే అపవాదు ఉంది.
అది ఈ ఎన్నికల్లో ఆయన మైనస్గా మారిపోయింది. ఇక్కడ నుంచి పేర్నినాని వైసీపీ జెండా పై విజయం సాధించారు. ఇక, ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో బైక్పై తిరుగుతూ.. తనమన అనే తేడా లేకుండా అందరికీ పనులు చేసి పెడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్తరి ఒక్కరికీ అందేలా చూస్తున్నారు.
దీంతో రెండు రోజుల కిందట దాదాపు 100 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి పేర్ని నాని సమక్షంలో వైసీపీ కండువాలు మార్చు కున్నారు. ఇదిలావుంటే, బీసీ వర్గానికి చెందిన జోత్యిరావు ఫూలే.. వర్ధంతిని నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించి మళ్లీ తన హవాను, బలాన్ని నిరూపించుకునేందుకు మాజీ మంత్రి కొల్లు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆయన భారీ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నారు. తీరా ఆయన కీలకమైన కేడర్ వైసీపీలో చేరిపోవడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నంత పనిచేసి చివరికి తూతూ మంత్రంగా లాగించేశారు. ఇక, ఇప్పుడు తన పరిస్థితి ఏంటనేది ఆయన చర్చించుకుంటున్నారు. స్థానికంగా కేడర్కు దూరమైతే.. పార్టీలో తన హవా సాగేనా? అనే సందేహం కూడా అలుముకుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి. మరో రెండు మాసాల్లో స్థానిక ఎన్నికలు ఉండడం, ఇప్పుడు కేడర్ బలహీనపడడం కొల్లుకు నిద్రపట్టనివ్వడం లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.