తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని కొన్ని మాట్లాడితే వింతగానో విడ్డూరంగాను ఉంటాయి. కాని అవి వాస్తవాలే... 2018 ఎన్నికల్లో బలంగా ఉన్న కెసిఆర్ ని ఎలా ? ఎదుర్కోవాలి అనే దాని మీద ఆలోచించడం మానేసి పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అని కొట్టుకున్నారు. ఇది కాస్తా జనాల్లోకి బలంగానే వెళ్ళింది. ప్రతీ చిన్న దానికి ఢిల్లీ వెళ్ళడం, గాంధీ భవన్ లో సమావేశం పెట్టడం, రాహుల్ గాంధీ దగ్గర పంచాయితి చేయడం వంటివి జనాలను చికాకు పెట్టాయి.
ఈ పరిణామాల దెబ్బకు ఆ పార్టీ కార్యకర్తలే ఇదేం కర్మ రా బై అనుకునే పరిస్థితి వచ్చింది. అది పక్కన పెట్టి రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం... పార్టీ అధికారంలోకి వస్తే ఎవడో ఒకడు ముఖ్యమంత్రి అవుతాడన్నది అందరికి తెలిసిందే. అయితే అందుకోసం మాత్రం ఎవ్వరూ కష్టపడడం లేదు. ఇక ఇప్పుడు రేవంత్ను టార్గెట్ చేస్తోన్న వారు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు.. భవిష్యత్తులో రేవంతే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి వాళ్ళ కొంప వాళ్ళే చక్కగా ముంచుకున్నారు.
రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తే ఎక్కడ తమకు ఇబ్బందో అని చెప్పి కొందరు కెసిఆర్ కి సహకరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది... కెసిఆర్ ని ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఉంది. ఆర్టీసి సమ్మె జరుగుతుంటే రేవంత్ రెడ్డికి ఇమేజ్ వస్తుంది అని చెప్పి... కొంత మంది నాయకులు ఆర్టీసి నేతలతో మాట్లాడి ఆయన సహకారం లేకుండా చేసారు. రాజకీయంగా రేవంత్ కి ఇమేజ్ ఎక్కువ ? దాన్ని వాడుకోవాలి... అది మానేసి ఆయనకు ఎక్కడ ఇమేజ్ వస్తుందో అనే కంగారులో ఆయన ప్రచారం చేశాడు కాబట్టే హుజూర్ నగర్ పోయిందన్న ప్రచారం షురూ చేశారు.
రేవంత్ సపోర్ట్ మీకు ఉంది కాబట్టే కెసిఆర్ హామీలు నెరవేర్చడం లేదని కార్మిక నాయకులకు మోశారు కొందరు. ఇక ఆయన ఎంపీ అవడం ఇష్టం లేని కొందరు... బిజెపికి వెళ్లి సిఎం అవుతాడు అంటూ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రచారం కూడా చక్కగా చేయడం విశేషం. ఇన్ని దాటుకుని ఆ పార్టీ అక్కడ ఎప్పుడు బలపడుతుందో ? చూడాలి. ఏదేమైనా రేవంత్ అటు టీఆర్ఎస్కు, ఇటు కాంగ్రెస్కు టార్గెట్ అయ్యాడు.