గూగుల్ ను వ్యవస్థాపకులు ఎవరు అంటే మనలో చాలామందికి తెలియదు. ఎందుకంటే వారి పేర్లు ఎప్పుడు మనం తెలుసుకొని ఉండలేదు. కానీ, గూగుల్ సీఈఓ ఎవరు అంటే మాత్రం టక్కున చెప్పేస్తారు. సుందర్ పిచాయ్ అని. మన భారతీయుడికి దక్కిన గౌరవం అది. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత గూగుల్ మరింతగా పరుగులు తీస్తున్నది. వెబ్ బ్రౌజింగ్ ప్రక్రియలో ఎన్నో కొత్తపుంతలు తొక్కుతున్నది.
కొత్తగా పరుగులు గూగుల్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అన్నింటిని మార్చేస్తున్నారు. సంస్థలో నైపుణ్యం కలిగిన వ్యక్తులను తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్ పిచాయ్ అత్యధిక జీతం అందుకుంటున్న సీఈవో గా అవతరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన జీతాన్ని మరింతగా పెంచింది గూగుల్.
ఇక ఇదిలా ఉంటె, సుందర్ పిచాయ్ కు గూగుల్ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ను నియమించింది. ఇప్పటి వరకు ఈ గూగుల్ మాతృ సంస్థ ను గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాని బాధ్యతలను వీరే చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాని నుంచి తప్పుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
కావాల్సిన సలహాలు సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ, ఇప్పుడు బాధ్యతలను నిర్వహించలేకపోతున్నామని, అందుకోసమే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ను మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు కూడా సీఈవో గా నియమించినట్టు వారు తెలిపారు. సో, ఇకపై ఆ సంస్థలో కూడా ప్రక్షాళన, మాతృ సంస్థ అభివృద్ధికి సుందర్ పిచాయ్ బాటలు వేయబోతున్నారు. మరి ఈ సంస్థ ఎంత మేరకు పరుగు తీస్తుందో చూడాలి.