భక్తి మాటున అకృత్యాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నిత్యానంద ఇప్పుడు మళ్లీ హాట్టాపిక్గా మారాడు. సెంట్రల్ అమెరికాలోని ఈక్వెడార్కు సమీపంలో ఉన్న ఓ ద్వీపాన్ని కొనుక్కొని...దానికి కైలాస అని పేరు పెట్టి తన ప్రత్యేక రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ప్రపంచంలో హిందువులకు ప్రత్యేకంగా దేశం లేదని, అందుకే తనది ప్రత్యేకంగా హిందూ దేశమని నిత్యానంద ప్రకటించుకున్నాడు. విరాళం ఇచ్చే హిందువులకు తన దేశంలో పౌరసత్వం ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాదు.. హింసకు గురవుతున్న హిందువులను కైలాసకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాడు. అక్కడికి వెళ్లి చేయాల్సిందల్లా నిత్యం స్వామిని సేవించడమే.
ఇదంతా బాగానే ఉన్నా...ఇప్పుడు నిత్యానంద తన తిక్కపనులతో వార్తల్లో నిలుస్తున్నాడు. కైలాసకు సొంతగా దాదాపు 550 పేజీల రాజ్యాంగం, సొంతంగా ప్రభుత్వాన్ని నిత్యానంద ఏర్పాటు చేశాడు. తనను తాను సర్వాధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. తన సన్నిహితుడైన మా అనే వ్యక్తిని ప్రధానిగా నియమించాడు. మరికొందరితో మంత్రి మండలి ఏర్పాటుచేశారు. తాను రోజూ క్యాబినెట్ సమావేశం జరుపుతున్నానంటూ నిత్యానంద ప్రకటించడం విశేషం. అంతేకాదు.. పది ప్రభుత్వ విభాగాలనూ ప్రకటించారు. వీటన్నింటికీ పరమపూజ్య శ్రీ నిత్యానంద పరమశివమ్ (హెచ్డీహెచ్) అనే విభాగం నేతృత్వం వహిస్తుంది. దీంతోపాటు హోం, రక్షణ, ఆర్థిక, వాణిజ్య, గృహనిర్మాణ, మానవసేవ, విద్య, వైద్యారోగ్య, నాగరికత, సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. కైలాస పేరిట ఉన్న వెబ్సైట్లో అనేక వివరాలు వెల్లడించాడు.కైలాస ప్రజలకు బంగారు, ఎరుపు రంగుల్లో రెండు రకాల పాస్పోర్ట్లు ఉంటాయట. ఇచ్చే విరాళాల మొత్తాన్ని బట్టి రంగు, హంగు మారుతుందన్నమాట.
ఇలా నిత్యానంద `లీలలు` వైరల్ అవడంతో...టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ రేంజ్లో ఆడుకున్నారు. నీ దేశానికి వీసా సంగతేంది స్వామి అంటూ ట్విట్టర్లో ఏకేశాడు. ‘అక్కడికి రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి? వీసా ఆన్ అరైవల్ ఇస్తారా` అంటూ నిత్యానంద నాటకాలను సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు.