దేశంలో ఒకవైపు మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే.. మరోవైపు దానికి సమానంగా దానికంటే ఎక్కువగానే దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. దోపిడీలు, దొంగతనాలకు చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు చాలా కష్టం అవుతున్నది. అయినా సరే కష్టపడి పట్టుకుంటున్నారు. అదేదో అత్తగారింట్లో ఉన్నట్టుగా ఉండి రిలీజ్ అవుతున్నారు. మరలా మాములే. పట్టుకొని కోర్టుకు తీసుకొస్తే.. కోర్టులో నిరూపణ కావొచ్చు.. కాకపోవచ్చు.. అయితే మంచిదే కాలేదంటే ఏం చేయలేని పరిస్థితి..
అందుకే ఏం చేయాలో కూడా పోలీసులకు అర్ధం కావడం లేదు. పైగా దేశంలో 434 మందికి ఒక పోలీస్ ఉండాలి.. కానీ, మన దేశంలో ప్రతి 500 మందికి ఒక పోలీస్ ఉంటున్నారు. పోలీసుల సంఖ్య పెరగాలి.. చట్టాలు కఠినం చేయాలి... మోటార్ వెహికల్ యాక్ట్ ను కఠినం చేస్తే ప్రజలే కాదు అటు కొన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. చట్టాలు కఠినం చేస్తే వ్యతిరేకత వస్తుంది. చేయకుంటే ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. వస్తువులను, డబ్బులను, ఇంకా అనేక విషయాల్లో ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూ ప్రజలను సోమరులను చేస్తున్నాయి. ఇవే దేశంలో నేరాలు పెరిగిపోయేలా చేస్తున్నాయి. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ ల్యాండ్ అంటారు.
మనకు మనం ఎంప్టీ మైండ్ కు క్రియేట్ చేసుకోవడం లేదు.. ప్రభుత్వాలే మన మెదళ్లను ఆలా తయారు చేయిస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి మనిషి కష్టపడి పనిచేసేవాడు. సొంతంగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. ఆ కష్టానికి వచ్చిన ప్రతిఫలంతో జీవించేవాడు. కానీ, ఇప్పుడు ఏం జరుగుతోంది.. కష్టాలు లేవు.. అన్ని సుఖాలే. అన్ని వస్తువులు ఇంటికే వచ్చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నాయి.
ఇంకప్పుడు మనిషి ఎందుకు పనిచేస్తాడు. తిని కూర్చునే మనిషిలో తప్పకుండా నేరస్వభావం పెరుగుతుంది. చెడు అలవాట్లు పెరుగుతాయి. ఈ నేర స్వభావాలు తగ్గించాలి అంటే ప్రతి మనిషి రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలపాటు పనిచేసేలా చట్టాలు తీసుకురావాలి. ఆలా తీసుకొచ్చి వాటిని కఠినంగా అమలు జరిగేలా చూడాలి. అలా చేస్తే.. తప్పకుండా మనిషికి జీవితం విలువ తెలుస్తుంది. జీవితం విలువ తెలిస్తే.. ఆ మనిషి తప్పు చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. జీవితం గురించి ఆలోచించే మనిషికి తప్పు చేయడు ... ఇంకా కష్టపడి పనిచేయడానికి అలవాటు పడిపోతాడు.
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో 18 సంవత్సరాలు దాటిన యువకులు తప్పని సరిగా కొన్నాళ్ళు ఆర్మీలో పనిచేసేలా చట్టాలు ఉన్నాయి. జపాన్ లో 18 సంవత్సరాలు దాటిన యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా పనిచేయాలనే రూల్ ఉన్నది. అందుకే ఆ దేశం అభివృద్ధి చెందింది. అంతెందుకు ప్రపంచం మొత్తం వెలేసిన ఉత్తర కొరియాలో ఉండే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఉత్తర కొరియా లాంటి దేశాల్లో నేరాలు ఎక్కువగా ఉండాలి. కానీ, అక్కడి ప్రభుత్వం చట్టాలను ఎంత కఠినంగా విధిస్తుందో చెప్పక్కర్లేదు. అందుకే అక్కడ నేరాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మన రాజ్యాంగాన్ని ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేలా తయారు చేసుకున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తయారు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు వాటిని మార్చాల్సిన అవసరం వచ్చింది. మరి దానికి మన నేతలు అంగీకరిస్తారా?