ఇంగ్లీష్ మీడియం విద్య అమలుపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాం అంశంపై బుధవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. మా పాలనలోనే అన్ని ప్రభుత్వం స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని కానీ తెలుగుకు ప్రాధాన్యం తగ్గించలేదని చెప్పడంతో..బదులుగా మాట్లాడుతూనే చంద్రబాబువన్నీ దిక్కుమాలిన ఆలోచనలేనని జగన్మోహన్రెడ్డి విరుచుకుపడ్డారు. పేదవాళ్లు ఇంగ్లిష్ నేర్చుకునే విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దారుణమైన విధానాన్ని అవలంబిస్తున్నారని తప్పుబట్టారు.
గత ప్రభుత్వ హయాంలో 65శాతం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉంటే.. కేవలం 35శాతం ప్రభుత్వ బళ్లలోనే ఇంగ్లిష్ మీడియం ఉందని లెక్కలతో సహ వివరించారు. ఇంకా ఆనాడే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు అమలుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం తప్ప మరొకటి చంద్రబాబుకు తెలియదని మండిపడ్డారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న నారాయణ ద్వారా అక్షరాల 94శాతం ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టి.. ప్రభుత్వ బళ్లను నిర్వీర్యం చేశారని ఎండగట్టారు. పేదల విద్యపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ దీనిబట్టి అర్థమవుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లు కూడా ప్రైవేటు పాఠశాలలకు పోటీపడే పరిస్థితి రావాలన్నదే తన ధ్యేయమని జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఏం చేసినా చంద్రబాబుకు రాజకీయమే కనిపిస్తోందని, వక్రీకరణే కనిపిస్తోందని మండిపడ్డారు. సాక్షిలో వచ్చిన ఓ కథనాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అంశంపై రేపు (గురువారం) సుదీర్ఘంగా సభలో చర్చించుకుందామని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. ఏదేమైనా అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో జగన్ వర్సెస్ బాబు మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. బాబు టార్గెట్గా జగన్ తీవ్రంగా స్పందించారు.