ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై జరిగన చర్చలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి చెబుతూ.. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తన గతాన్ని నెమరు వేసుకున్నారు. ఇంగ్లీష్ రాక తాను ఎంతగా ఇబ్బంది పడిందీ ఆమె అసెంబ్లీలో వివరించారు. తన విద్యాభ్యాసంపై ఇంగ్లీష్ ప్రభావాన్ని చాలా ఆసక్తిగా చెప్పారు.
ఆమె ఏం చెప్పారంటే.. “ ఇంగ్లీష్ రాకపోతే ఎంత నష్టం అన్న విషయంలో నేనే ఒక ఉదాహరణ. నేను పదో తరగతి వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదివాను. ఇంటర్ సెయింట్ థెరిసాలో చేరాను. ఇంగ్లీష్ రాక మూడు నెలలు అన్ని సబ్జెక్ట్లు ఫెయిల్ అయ్యాను. భయంతో అక్కడ మానేసి జంగారెడ్డిగూడెంలో తెలుగు మీడియంలో చేరాను. టెన్త్ వరకు ఫస్ట్క్లాస్ స్టూడెంట్ను..ఇంటర్లో చాలా వెనుకబడ్డాను.
డిగ్రీలో ఇంగ్లీష్ మీడియంలో చేరాను. మూడేళ్లు ఇంగ్లీష్ చదివాను కాబట్టి అర్థం అవుతుంది కానీ, ఇంగ్లీష్ రాదు. ఇటీవల గురుకుల పాఠశాలలో సైన్స్ఫెయిర్కు వెళ్తే పిల్లలంతా కూడా ఇంగ్లీష్లో చెబుతుంటే అర్థం చేసుకున్నాను కానీ మాట్లాడలేకపోయాను. ఇంగ్లీష్ రాదని చెప్పడానికి సిగ్గుపడటం లేదు. చాలా మంది ఇంగ్లీష్ వస్తుందని చెప్పుకుంటుంటారు. మేం చదువుకునే సమయంలో వైయస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉండి ఉంటే మేం కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివి బాగా మాట్లాడి పేరు తెచ్చుకునేవాళ్లమంటూ గతం గుర్తు చేసుకున్నారు పుష్పశ్రీవాణి.
తెలుగు మన మాతృభాష, ఈ సృష్టిలో తల్లి ఉన్నంత వరకు తెలుగు గడ్డపై తెలుగు భాష ఉంటుందన్నది మర్చిపోతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ తెలుగును ఉద్దరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. వైయస్ జగన్ భయపడే వ్యక్తి కాదని వీళ్లు గుర్తించుకోవాలి అన్నారు పుష్పశ్రీవాణి.