2009లో అప్పటి ఏపీ సీఎం వైఎస్సార్ మరణంతో చంద్రబాబు ఇక తానే ఏపీకి నాయకుడు అనుకున్నారా.. ఇంక తనకు ఏపీలో ఎదురు లేదు అన్నారా.. అవునంటున్నారో మంత్రి ఆయన గతంలో చంద్రబాబు పార్టీలోనే ఉండేవారు. ఆయనే మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబును 25 ఏళ్లుగా చూస్తున్నాను. వైయస్ రాజశేఖరరెడ్డి బతికిఉన్నంత కాలం ఒకలా ఉన్నాడు.. ఆయన మరణించిన తరువాత చంద్రబాబు ఇక రాష్ట్రానికి నేనే నాయకుడిని ఎవరూ లేరని ఫీలయ్యాడని అవంతి అసెంబ్లీలో అన్నారు.
అవంతి ఇంకా ఏమన్నారంటే.. “ శాసనసభలో నాలుగు రోజులుగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రవర్తించడం లేదన్నారు. వైయస్ఆర్ సీపీని తిట్టాలనుకుంటే సాయంత్రం ప్రెస్మీట్ పెట్టి తిట్టాలని, సభా సమయాన్ని వృథా చేయవద్దని ప్రతిపక్షానికి సూచించారు. అమరావతిలో చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు వేశారని బాధపడ్డా కానీ, మళ్లీ వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ గుర్తుకువచ్చిందన్నారు.
ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. మళ్లీ ఇవాళ టీడీపీకి చెందిన సగం మంది ఎమ్మెల్యేలు కూడా సభకు రావడం లేదని, సీఎం వైయస్ జగన్ సై అంటే సగం మంది ఎమ్మెల్యేలు ఖాళీ అయిపోతారన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు అవంతి శ్రీనివాస్.
ప్రజల మేలు కోసం, రాష్ట్రం మంచి కోరి సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అన్నం కూడా తినకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీ చర్చలో పాల్గొంటున్నారు. ప్రజల కోసం పరితపించే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని ఉన్మాది అని చంద్రబాబు మాట్లాడారు అని.. సీఎంకు బాబు క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు. అమ్మఒడి పథకం తీసుకువచ్చినందుకా ఉన్మాది.. ఫీజురీయింబర్స్మెంట్ తీసుకువచ్చినందుకా.. 25 లక్షల ఇళ్లు కట్టిస్తానన్నందుకా.. రైతు భరోసాతో అన్నదాతలకు మేలు చేసినందుకు ఉన్మాదా..? అని నిలదీశారు మంత్రి అవంతి శ్రీనివాస్.