హైదరాబాద్ అత్యాచారాలకు, హత్యలకు అడ్డాగా మారిపోయింది. గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు మూడు నెలల క్రితం వరకు హైదరాబాద్ రోడ్డుపై యువకుడిని హత్య చేసిన నిందితులు... కత్తులతో నరికి చంపిన దుండగలు అనే న్యూస్ లు వచ్చేవి. కానీ, తరువాత అత్యాచారాల పర్వం మొదలైంది.
నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచారం జరుగుతూనే ఉన్నది. దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత కూడా ఇలాంటి ఘటనలు ఏ మాత్రం ఆగడం లేదు. జరుగుతూనే ఉన్నాయి. దిశ కేసులో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పోలీసు శాఖ తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకుంటోంది. 100 కి డయల్ చేస్తే వేగంగా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటోంది.
అంతవరకూ బాగానే ఉన్నది... అయితే, ఇప్పుడు మరలా హైదరాబాద్ నగరంలో హత్యలు మొదలయ్యాయి. రౌడీ షీటర్ సయ్యద్ భాయ్ అనే వ్యక్తిని నలుగురు నిందితులు అత్యంత కిరాతకంగా హత్య చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఇలా హత్య జరగడానికి కారణం ఏంటి... ఎందుకు హత్య చేశారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సయ్యద్ భాయ్ అనే వ్యక్తి రజాక్ అనే డ్రైవర్ ను తనకు ఇవ్వాల్సిన ఆటో ఫైనాన్స్ డబ్బులు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. డిమాండ్ చేయడమే కాదు, చేయి చేసుకున్నాడు. దీనిని అవమానంగా భావించిన రజాక్... వెంటనే తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఫ్రెండ్స్ ముగ్గురు రజాక్ దగ్గరికి వచ్చారు. గురువారం రాత్రి ఎన్ బిటి ఆటో అడ్డా వద్ద సయ్యద్ భాయ్ ను అడ్డుకొని కత్తులతో దాడులు చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అనంతరం నిందితులు నలుగురు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.