తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగిన నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఎన్టీఆర్ తర్వాత నియోజకవర్గంలో బలమైన నేతలు పార్టీకి దొరికారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో క్యాడర్ కూడా ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఎక్కువ. రావి కుటుంబం నియోజకవర్గంలో సత్తా చాటడానికి ఆ క్యాడర్ కారణం. ఇకపోతే నియోజకవర్గంలో నానీ అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు తెలుగుదేశం క్యాడర్ గా ఉన్న వాళ్ళు అనూహ్యంగా నానీ అభిమానులుగా మారిపోయారు. నానీ వెంట నడిచారు.
2009 ఎన్నికల్లో నానీ విజయానికి ఆ అభిమానులే కారణం... ఇక అక్కడి నుంచి నానీ హవా మొదలయింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో నానీ... వైసీపీలోకి వెళ్ళారు... అప్పుడు కూడా ఆయన వెంట భారీగా క్యాడర్ వెళ్లిపోయింది. 2019 ఎన్నికల్లో అవినాష్ తెలుగుదేశం నుంచి పోటీ చేసినా సరే నానీ సంగతి తెలిసిన వాళ్ళు... అవినాష్ భారీగా ఓడిపోతారని ముందు నుంచి చెప్తూ దూరంగా ఉన్నారు.
ఇప్పుడు అవినాష్ కూడా వైసీపీలోనే ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేత అనే వారు కనపడట౦ లేదు.రావి వెంకటేశ్వరరావు ఉన్నా సరే ఆయన అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆయన విషయంలో కార్యకర్తలు కూడా అంత నమ్మకంగా కనపడటం లేదని అంటున్నారు. నానికి ఎదురు నిలిచి నియోజకవర్గంలో గెలిచే నేత లేరు. అసలు ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు గుడివాడలో నానియే గెలుస్తున్నాడు. ఈ క్రమంలో నాని ఉండగా అక్కడ టీడీపీ పగ్గాలు చేపట్టేందుకు కూడా ఏ నేత ఇష్టపడడం లేదు.
దీనితో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ వైసీపీ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత గుడివాడ క్యాడర్ ప్రధానంగా గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లో పార్టీ మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏదేమైనా టోటల్ టీడీపీ కేడర్ను కూడా గుడివాడలో నాని ఖాళీ చేసేయడం ఖాయంగానే కనిపిస్తోంది.