తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్) లో అప్పుడే రాజ్యసభ స్థానాలను కోసం పోటీ ప్రారంభమయింది . వచ్చే ఏడాది రెండు రాజ్యసభ స్థానాలకు ఖాళీ కానున్నాయి .ఈ రెండు స్థానాల కోసం పార్టీ లో పలువురు పోటీ పడుతున్నారు . సామాజిక సమీకరణాల ఆధారంగా ఒక స్థానాన్ని అగ్ర వర్గాలకు , మరొకటి బిసిలకు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది . బిసి కోటా లో మరోసారి పార్టీ సెక్రటరీ జెనరల్ కేశవరావు కు రాజ్యసభ పదవి కేటాయించే అవకాశాలున్నాయని సమాచారం .
కేశవరావు రాజ్యసభ పదవి కాలం వచ్చే ఏడాది పూర్తి కానుండడం తో ఆయనకు తిరిగి కేసీఆర్ రెన్యూవల్ చేస్తారా ? లేదా ?? అన్నది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . కేశవరావు కు తిరిగి రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తే , రెండవ స్థానాన్ని ఎవరికీ కట్టబెడుతారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది . రాజ్యసభ స్థానం కోసం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , నిజామాబాద్ మాజీ ఎంపీ , కేసీఆర్ కుమార్తె కవితలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది . ఢిల్లీలో జాతీయ నేతలతో విస్తృత పరిచయాలు ఉన్న వినోద్ కు రాజ్యసభ పదవి కట్టబెట్టి , ఆయన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హస్తిన లో ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది .
అదే నిజమైతే కవిత కు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నది స్పష్టం అవుతోంది . రాజ్యసభ స్థానాన్ని కవితకు కట్టబెడితే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండడం తో , వినోద్ కు ఇవ్వడమే బెటరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. గతంలో కేసీఆర్ తన మరదలి కుమారుడు సంతోష్ రావు కు రాజ్యసభ స్థానాన్ని కేటాయించడం పట్ల తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన విషయం తెల్సిందే .