ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్ధ.. బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అన్న నినాదం ఇక నుంచి కనుమరుగవనున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థను ప్రజా రవాణా సంస్థగా మార్చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో నిన్న మొన్నటి వరకు ఎంతో ప్రజాదరణ పొందిన ఆర్టీసీ నినాదం వినిపించదేమో. అసలు విషయంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్ధ (ఆర్టీసి) పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారవాణా శాఖగా మార్చబోతున్నారు. ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ హోదాను కమీషనర్ లేదా చీఫ్ కమీషనర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టుగా మార్చబోతున్నట్లు తెలిసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టు పేరుకు అభ్యంతరం లేదు. కానీ కమీషనర్ లేదా చీఫ్ కమీషనర్గా కాకుండా డైరెక్టర్ జనరల్ (డిజి) హోదా పెట్టాలని రిటైర్డు ఐపిఎస్ అధికారులతో పాటు ప్రస్తుత ఐపిఎస్ అధికారులు కూడా కోరుతున్నట్లు తెలిసింది.
రవాణా శాఖకు కమీషనర్ ఉన్నారు. పబ్లిక్ రవాణా శాఖకు కమీషనర్, చీఫ్ కమీషనర్ హోదా కన్నా డెరెక్టర్ జనరల్ (డిజి) హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ను స్వయంగా కలిసి కొంతమంది ఐపిఎస్ అధికారులు, రిటైర్డు ఐపిఎస్ అధికారులు కోరినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ ట్రాన్స్పోర్టుగా పేరు మార్చిన అనంతరం ప్రస్తుత ఆర్టీసి సంస్థలో ఎవరెవరు ఏ హోదాలో పని చేస్తున్నారో ఆ హోదాల పేర్లన్నీమార్చబోతున్నారు. ఇక నుండి జీత భత్యాలు కూడా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించనున్నారు. కమీషనర్ లేదా చీఫ్ కమీషన్ హోదాకోసం ఐఎఎస్ అధికారులు ప్రయత్నిస్తుండగా డైరెకక్టర్ జనరల్ హోదా కోసం ఐపిఎస్ అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో యాభై వేలు పైగా సిబ్బంది ఉన్న నేపధ్యంలో చీఫ్ కమీషనర్ హోదాతో పాటు ఎక్స్అపిిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇస్తే బాగుంటుందని ఐఎఎస్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఐపిఎస్ అధికారులే ఎక్కువ మంది బాధ్యతలు నిర్వహించారు. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ హోదాపై ఏ పేరు పెట్టాలి అనే విషయంపై స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది.