రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిషేధానికి అంచెలంచెలుగా చర్యలు తీసుకుంటుండగా.. ఓ బార్ యాజమాన్యం మాత్రం తాడిపత్రిలో మద్యం ప్రియులకు ఫుల్గా పట్టిస్తోంది. ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తోంది. భారీ ఫ్లెక్సీ కూడా బార్ ఎదుటే ఏర్పాటు చేసి మందుబాబులకు వల విసురుతోంది. బ్రాండెడ్ సరుకైనా సరే కాసింత తాగితేనే తలకెక్కుతుండగా.. తాగినోళ్లంతా చిత్తయిపోతున్నారు. బ్రాండెడ్ సీసాల్లో నకిలీ లిక్కర్ను పోసి మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలున్నా.. అటువైపు అబ్కారీ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మొత్తం మూడు బార్ అండ్ రెస్టారెంట్లు తాడిపత్రి పట్టణంలో ఉన్నాయి. జేసీ సోదరుల అనుచరులే అవన్నీ నిర్వహిస్తున్నారు. వేళాపాలా లేకుండా ఇన్నాళ్లూ ఇష్టానుసారం మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్న వారంతా.. మద్యం నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆలోచనలో పడ్డారు. ఇక దోపిడీకి కొత్తదారి వెతుక్కున్నారు. ఈక్రమంలో‘హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్’ పోలీసు స్టేషన్ సమీపంలోనే ఏర్పాటు చేసిన జేసీ సోదరుల అనుచరుడు సంగటి ప్రసాద్రెడ్డి కొత్త దందాకు తెరతీశాడు. సాధారణంగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం ధర అధికంగా ఉంటుంది. ఎక్కడైనా రాష్ట్రంలో ఇదే విధానం నడుస్తోంది. కానీ హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకు మద్యం విక్రయిస్తోంది. ఏకంగా బార్ ఎదుటే భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ధరతో పాటు బార్లో ఇస్తున్న ధరలను ఫ్లెక్సీపై ముద్రించి మద్యం ప్రియులను ఆకర్షిస్తోంది.
ప్రభుత్వానికి ఎవరైనా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే లైసెన్స్ కోసం రూ.లక్షల్లో చెల్లిస్తారు. ఈ మేరకు సంపాదించేందుకు అవసరమైతే అదనపు ధరలతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే తక్కువకు మద్యం హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం విక్రయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. అక్రమంగా మద్యాన్ని కర్ణాటక ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారా? లేక ఇన్ని రోజు లు నిల్వఉంచిన పాత స్టాకును ఇప్పడు తక్కువ ధరకే విక్రయిస్తున్నారా! అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎక్సైజ్ అధికారులు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యాన్ని విక్రయించినా.. ఎక్కువ ధరకు విక్రయించినా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పట్టణం నడిబొడ్డున ఏకంగా ఫ్లెక్సీ వేసి మరీ తక్కువ ధరకు మద్యం హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గతంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం కర్నూలు జిల్లాలో ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించగా అక్కడి ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారని, ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదని జనం చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ లిక్కర్ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లో విక్రయిస్తున్న మద్యం నకిలీ మద్యమా..? అనే అనుమానాలను మద్యం ప్రియులే వ్యక్తం చేస్తున్నారు. గతంలో బార్ నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా తీసుకున్న ఇప్పుడు హఠాత్తుగా రేటు తగ్గించడం.. బ్రాండెడ్ మద్యం తీసుకున్నా.. కొంచెం తాగగానే కిక్కు ఎక్కుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే నకిలీ మద్యాన్ని కొనుగోలు చేసి బ్రాండ్ లేబుళ్లు మార్చి విక్రయిస్తున్నట్లు వారంతా భావిస్తున్నారు.