రాష్ట్రంలో మొన్న పెరిగిన ఇసుక ధరలుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు ఇసుక దండలు వేసుకున్నారు. నిన్న ఉల్లిపాయల ధరలు పెరిగాయని ఉల్లిపాయ దండలు వేసుకొచ్చారు. వీలైతే ఒకసారి చెప్పులు, పెట్రోల్ ధరలు పెంచితే చెప్పుల దండలు కూడా వేసుకుంటారేమో చూడాలి..? అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు అనుమానం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో అదీప్రాజు మాట్లాడుతూ.. ‘అచ్చెన్నాయుడు నిన్న పొట్టిశ్రీరాములు వర్ధంతి రోజున మద్యం కోసం మాట్లాడుతున్నాడు. టీడీపీ కార్యకర్త అచ్చెన్నాయుడి వియ్యంకుడు బండారు సత్యనారాయణ మూర్తి కొడుకు పొట్టి శ్రీరాములుకు ఎవరూ ఇవ్వలేనంతా ఘనంగా నివాళులర్పించారు. తప్పతాగి అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతి వేగంగా కారు నడిపి డివైడర్ను ఢీకొట్టి, బైక్ను ఢీకొట్టి నేరుగా పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఢీకొట్టాడు.
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సృజల స్రవంతి అనే మహత్తరమైన ప్రాజెక్టుకు 2009 ఫిబ్రవరి 21న సబ్బవరంలో శంకుస్థాపన చేశారు. పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం మండలంలో అయ్యన్నపాలెం భూదేవి చెరువును ఒక రిజర్వాయర్గా చేపట్టి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే కార్యక్రమం. విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షల ఎకరాలు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, సుమారు 12 వందల గ్రామాలకు తాగునీరు అందించాలి. పరిశ్రమలకు ఒకశాతం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఆ రోజున రూ.7214 కోట్లు మంజూరు కూడా చేశారు. వైయస్ఆర్ మరణం తరువాత ఆ కార్యక్రమాన్ని పక్కనబెట్టారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు అదే ప్రాజెక్టును చోడవరంలో శంకుస్థాపన చేశారు. చెల్లికి జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉంది. ఒక్క ప్రాజెక్టును పబ్లిసిటీ కోసం శంకుస్థాపన చేశారు. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టును వైయస్ఆర్ కలగా భావించారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని’ ప్రభుత్వాన్ని కోరారు.