మానవ విలువలు ఎంతగా పతనమవుతున్నాయో తెలియజేసే సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. రోడ్డు పక్కన బిక్షాటన చేస్తూ పొట్ట నింపుకునే యాచకురాలిపై కూడా ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి తెగబడిన ఘటన హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మల్కాజ్గిరిలో వీధుల్లో బిక్షాటన చేస్తూ పొట్ట పోసుకునే 60 ఏళ్ల వృద్దురాలిపై , అదే ప్రాంతానికి చెందిన చిన్నప్ప, నేనావత్ విజయ్ కుమార్ లు ఈనెల 17వ తేదీన రాత్రి అత్యాచారానికి తెగబడ్డారు. ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. అప్పుడు వారి దృష్టి రోడ్డు పక్కనే కూర్చున్న యాచకురాలిపై వారి కన్నుపడింది. ఇద్దరు కలిసి సదరు యాచకురాలికి మాయ, మాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లారు. యాచకురాలి చేత మద్యం తాగించి, ఆమె స్పృహ తప్పగానే ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తరువాత స్పృహలోకి వచ్చిన యాచకురాలు కేకలు వేయడంతో స్థానికులు చుట్టూ పక్కల వారు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఇరువురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న మల్కాజ్గిరి పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇరువురు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడలో తలదాచుకున్నట్లు తెలుసుకుని , అదుపులోకి తీసుకున్నారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘనట అనంతరం రాష్ట్రంలో ఈ తరహా సామూహిక అత్యాచార ఘటనలకు ఫుల్స్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇటీవల మహిళలపై, బాలికలపై లైంగిక దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
మహిళలు, బాలికలపై పెరుగుతున్న అత్యాచార ఘనటలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నిందితులు మాత్రం ఎటుంటి బెరుకు లేకుండా లైంగికదాడులకు పాల్పడుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మల్కాజ్గిరిలో వృద్దురాలైన యాచకురాలిపై అత్యాచారానికి పాల్పడిని నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.