దేశవ్యాప్తంగా ప్రస్తుతం కమలానికి ఎదురుగాలి వేస్తోంది. దీనికి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలే ఓ కారణం అని చెప్పొచ్చు. భారతదేశంలో చట్టం చేయడం వరకే మనం చేయాల్సింది. దాన్ని బలవంతంగా అమలు చేయాలనీ చూస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. పౌరసత్వం విషయంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తోంది. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఓటుబ్యాంక్ రాజకీయాలు ఉన్నంతకాలం ఈ దేశంలో కఠిన చట్టాలు అమలు జరగడం అన్నది కష్టమైన విషయంగా చెప్పాలి.
చట్టాలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అన్వయించుకుంటూ, తప్పుగా అర్ధం చేసుకుంటూ వెళ్తుంటారు. అందుకే ఒకరికి రైట్ అనిపించింది మరొకరికి రాంగ్ అనిపిస్తుంది. ఒకరికి రాంగ్ అనిపించింది మరొకరి రైట్ అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణలో కాస్తోకూస్తో బీజేపీ బలంగా ఉన్నది. గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ, ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకుంది.
కాగా, ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటికే గంటమోగింది. జనవరి 22 న ఎన్నికలు, జనవరి 25 న ఫలితాలు ఉంటాయి. ఈ ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ ఎన్నికల్లో పౌరసత్వం, ఎన్ఆర్సిని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని అనుకుంటోంది మజ్లీస్ పార్టీ. డిసెంబర్ 27 వ తేదీన నిజామాబాద్ లో ఎంఐఎం పార్టీ భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు తెరాస మద్దతు కోరింది.
తెరాస పార్టీ ఎన్ఆర్సికి, పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. పౌరసత్వం చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంఐఎం, తెరాస మధ్య బలమైన మైత్రి ఉన్నది. ఈ మైత్రి ఈ చట్టం తరువాత మరింత బలపడేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీకి కొంత వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి బీజేపీ ఈ సవాల్ ను ధీటుగా ఎదుర్కొంటుందా చూడాలి.