హైదరాబాద్ లోని శంషాబాద్ లో దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. ఆ తర్వాత దిశ రేపిస్టులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత అంతటా హర్షం వ్యక్తమైంది. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ దిశ చట్టం రూపొందించిన సంగతి తెలిసిందే. రేపిస్టులకు సత్వరమే శిక్ష పడాలన్నది ఈ చట్టం ఉద్దేశ్యం.

 

ఇప్పుడు ఈ చట్టం పకడ్బందీ అమలు కోసం జగన్ చర్యలు ప్రారంభించారు. దిశ చట్టం అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దిశ చట్టం అమలుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని, కోర్టుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సూచించారు.

 

దిశ చట్టం అమలు కోసం 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మరో రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో 176 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.  మహిళా పోలీస్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బంది ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ అంగీకరించారు.

 

అంతేకాదు.. ప్రతి జిల్లాలో వన్‌స్టాప్‌ సెంటర్లను బలోపేతం చేయాలని, వన్‌స్టాప్‌ సెంటర్లలో ఒక మహిళా ఎస్‌ని నియమించాలన్నారు. అదే విధంగా దిశ యాప్‌ కూడా రూపొందించాలన్నారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద దిశ చట్టం అమలు దిశగా ఏపీలో ప్రభుత్వం బాగానే చర్యలు తీసుకుంటోంది. దీనిపై మహిళల్లోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: