దసరా సంక్రాంతి సీజన్లలో ఆర్టీసీకి భారీ ఆదాయం వస్తుంది. గత దసరా సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా ఆర్టీసీ భారీ ఆదాయం కోల్పోయింది. దాదాపు అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ చెప్పి దాదాపుగా 53 రోజులపాటు సమ్మె చేశారు. ఆ సమయంలో జరిగిన గొడవ మామూలు గొడవ కాదు. దాదాపుగా 30 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉండిపోయారు.
ఉద్యోగాలు తీసేశామని చెప్పిన ప్రభుత్వం తరువాత ఉద్యోగులపై దయ చూపి తిరిగి విధుల్లోకి తీసుకుంది. తీసుకోవడమే కాకుండా ఆర్టీసీని ఎలా లాభాల్లోకి తీసుకురావాలో ప్లాన్స్ వేశారు. అందులో భాగంగానే చార్జీలు పెంచారు. పెంచిన చార్జీల్లో నగరంలో తిరిగి బస్సుల్లో తగ్గించారు. అటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల చార్జీలు కూడా తగ్గించారు. కానీ, హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లే బస్సుల చార్జీలు మాత్రం అలానే ఉన్నాయి.
కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం సంక్రాంతి రాబోతున్నది. ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి కోసం ఆర్టీసీ నయా ప్లాన్ వేసింది. ఎలాగైనా తగినంత ఆదాయాన్ని తెచ్చుకోవాలని చూస్తున్నది. ఈ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి దాదాపుగా 4, 940 బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధం అయ్యింది. జనవరి 10 నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
జనవరి 10 నుంచి జనవరి 13 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండబోతున్నాయి. అయితే సంక్రాంతి స్పెషల్ బస్సులుగా వీటిని తిప్పబోతున్నారు కాబట్టి టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నదా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే, సంక్రాంతి సమయంలో ప్రైవేట్ బస్సులు టికెట్స్ ధరలు భారీగా ఉంటున్నాయి. ఈ ధరలు చూస్తే ఎవరికైనా సరే మతిపోతుంది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నా టికెట్ ధరలు వేల రూపాయలు ఉంటున్నాయి.