ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా 3 రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో 3 రాజధానిలు ఏర్పడితే అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతి లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతులందరూ తీవ్ర స్థాయిలో జగన్ ప్రకటించిన 3 రాజధానిల ప్రకటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భావితరాల భవిష్యత్ కోసం తమ పంట పండించే భూమిని రాజధాని అమరావతి కోసం త్యాగం చేస్తే ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని మారుస్తామంటే మాకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు. రాజధాని రైతులే కాకుండా కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీదికి చేరి ధర్నాలు దీక్షలు చేపడుతూ ఆందోళన తెలుపుతున్నారు. దీంతో రాజధాని మొత్తం అట్టుడుకుతోంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తోంది. ఇకపోతే తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మూడు రాజధానిల గురించి ఒక క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు కానీ మూడు రాజధాని ల పై నిర్ణయం మాత్రం వాయిదా పడింది.
అయితే క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని ఈ సమావేశంలో చర్చించిన పలు విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఏపీ రాజధానిగా ఏ పేరు రాసుకోవాలని మంత్రి పేర్ని నానిని ప్రశ్న అడిగారు. అయితే మంత్రి పేర్ని నాని దీనికి కాస్త ఇబ్బందికి గురయ్యారు. నీ పేరేంటి మీది ఏ ఛానల్ రాజధాని పేరు మీరు ఎప్పుడూ ఏం రాసుకుంటారు అంటూ అసహనం తో తిరిగి ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. అప్పుడు మీడియా ప్రతినిధి నెల రోజుల తర్వాత రాసుకోవడానికి అడుగుతున్నామని బదులిచ్చాడు.. అప్పుడు రండి చెబుతాం అంటు సమాధానం ఇవ్వకుండా మీడియా ప్రతినిధి ప్రశ్నను తోసిపుచ్చారు మంత్రి పేర్ని నాని.