గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికే కలిసినట్టుతెలిపారు. సీఎం జగన్ను గుంటూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల గురించి తెలియజేసారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ముఖ్యమంత్రికి తన నియోజకవర్గ పరిస్థితిని వివరించగా, రూ. 25 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరితో ఉన్నారని అన్నారు.
అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు నాడు-నేడు కార్యక్రమంతో మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ కార్యదీక్షత, పట్టుదల చూసి చాలా సంతోషం వేసిందన్నారు. ఉగాది నాటికి పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ అయిందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మళ్లీ అదే విప్లవం రాబోతోందన్నారు. బొల్లాపల్లి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.
సీఎంకి రాజధాని గురించి మాట్లాడే పెద్దవాడిని కాదని, రాజధానిపై స్పష్టత ఉందన్నారు. అమరావతిలో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని, రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని, అప్పటివరకు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు.
రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఐదేళ్లలో రైతుల్ని ఎవరో ఇబ్బంది పెట్టింది అందరికి తెలుసునని అన్నారు. పార్టీ మారడం గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గిరిధర్ తాను చంద్రబాబును విమర్శించడం లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలని మాత్రమే చెబుతున్నానని అన్నారు.