బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని ఆయన పేర్కొన్నారు.అతనొక్కడే దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో పార్టీ అధికార ప్రతినిధినని,ఆయన చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది ఆయన తెలిపారు.
ఇక దీనిపై జీవీఎల్ ఈ విషయం నేను అధికారికంగా చెబుతున్నా. మీరు బాండ్ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని అన్నారు. ఈ విషయంలో తమ పార్టీలో పార్లమెంట్లో సభ్యులు కాని వారు చాలా మంది ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని తరలింపు గురించి కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.
ఒకే మాటపై పార్టీలో నేతలు లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ అంశంపై టీడీపీలో ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. మరో రకంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్కల్యాణ్లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది.
అప్పుడు కేంద్రం రాజధాని అమరావతిలోనే పెట్టండని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని అని కూడా కేంద్రం చెప్పదు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వంఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు.