టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ మాఫియాకి ఇన్నాళ్లకు అడ్డుకట్ట మొదలైంది. ఏడు నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం దన్నుతో ఆయన ‘లిక్కర్’ అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఎక్సైజ్ పోలీసులు ఆయన జోలికి వెళ్లేందుకు సాహసించలేని ఈ మధ్యనే ఎట్టకేలకు దాడులు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి బినామీ బార్లో మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు.
ఉన్నత స్థాయి ఆదేశాలతో ఎట్టకేలకు సదరు బార్ క్లోజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకాబస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన ఒక బహిరంగ రహస్యం. ఈ బార్ జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న నిజానికి సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్కే కాదు.. ఎక్సైజ్ అధికారవర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలకు సంబంధించి ఈ బార్ అండ్ రెస్టారెంట్పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి.
గత ఐదేళ్లుగా అధికారం దన్నుతో ఎవరూ దాడులు చేసే సాహసం చేయలేదు. గురువారం ఈనెల 12వ తేదీన పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్ టాస్క్ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్ను, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని ఎంసీ బ్రాందీలో మిక్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
17 ఫుల్ బాటిళ్లను అప్పటికే కల్తీ చేసి సీజ్ చేశారు. పోలీసులు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఘటన జరిగిన దరిమిలా ఎక్సైజ్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేసు తాత్సారం చేస్తూ వచ్చిన ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు ఆదివారం పొద్దుపోయాక బార్ అండ్ రెస్టారెంట్ను సీజ్ చేశారు.