నూతన సంవత్సరం రోజున సామాన్యుని నెత్తిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బండ మోపాయి . వంటగ్యాస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించి సామాన్య , మధ్య తరగతి ప్రజల ఉత్సాహం పై నీళ్లు చల్లాయి . గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో సామాన్య , మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడనుంది. గత నాలుగు నెలలుగా గ్యాస్ సిలిండర్ల ధరలు క్రమంగా పెరుగుతూ, వస్తుండడం తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు .
గత నాలుగు నెలలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ వచ్చిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు , ఈ నెల కూడా అదే ఆనవాయితీని కొనసాగించి , తమ లాభాలను పెంచుకునే ప్రయత్నాన్ని చేశాయి . ఈ ఐదు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర 140 రూపాయలు పెరిగినట్లయింది . 14 . 2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ను ఢిల్లీ లో 19 రూపాయలు పెంచిన ఇండియన్ ఆయిల్ సంస్థ , ముంబాయి లో 19 .50 రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించింది . ఇక దేశం లోని ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర ను 20 రూపాయలుగా పెంచుతున్నట్లు వెల్లడించింది .
ఈ ధరల పెంపుతో ఢిల్లీ లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 714 రూపాయలకు లభించనుండగా , ముంబాయి లో 895 రూపాయలకు లభించనుంది . ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో కోల్ కత్తా లో 747 రూపాయలు , చెన్నై లో 734 రూపాయలకు లభించనుంది . గ్యాస్ సిలండర్ల పెంపు ధర వెంటనే అమలులోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రకటించింది . ఇక కమర్షియల్ సిలిండర్ ధరలను కూడా పెంచుతున్నట్లు వెల్లడించింది . ఢిల్లీ లో కమర్షియల్ సిలిండర్ 1 , 241 రూపాయలు , ముంబాయి లో 1 , 190 రూపాయలకు లభించనున్నట్లు తెలిపింది .