మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కేటీఆర్ స్థాయికి ,రాహుల్ స్థాయికి పోలిక ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు.రాహుల్ గాంధీ ప్రధాని పదవిని వద్దని త్యాగం చేసిన వ్యక్తి అని, ఆయనతో కేటీఆర్ను పోల్చడం సరికాదని అన్నారు.
కేటీఆర్ను పొగుడుకో, భజన చేసుకో తప్పులేదు కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకు అని హితవుపలికారు. మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు మానుకోవాలని లేకపోతే, తాము కూడా అదే తరహలో ప్రతి విమర్శలు చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. గురువారం గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రతి ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు, పోలీస్, ప్రభుత్వ అధికారులను విరివిగా వాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల్లో వారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. గత ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులతో ఇబ్బందులు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ కనీసం వారం పది రోజులు వ్యవధి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారుకు నోటీఫికేషన్కు ఉండాలి. టీఆర్ఎస్కు ఎన్నికల అధికారి నాగిరెడ్డి అమ్ముడు పోయారు. అధికార పార్టీకి ఐఏఎస్ అధికారులు ఊడిగం చేయడం మానుకోవాలి.రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ సర్కార్ చెప్పగలదా. సంగారెడ్డికి మంచి నీటి ఇబ్బందులకు మంత్రి హరీష్ రావు ప్రధాన కారణం. మా నియోజకవర్గ ప్రజల మంచినీటి కష్టాల గురించి మాట్లాడని హరీష్.. స్కూల్స్ లో పిల్లలను లెక్కలు అడుగుతున్నారు. సర్కార్ బడుల్లో పిల్లల చదువులు అద్వాన్నంగా ఉన్నాయని చెప్పే పనిలో హరీష్ ఉన్నారు. ప్రవేటు స్కూల్స్ తరుపున హరీష్ పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.