బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో రెండు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లతో సహా 8 మంది దుర్మరణం చెందారు. ఇరాన్ మద్దతుదారులు కొందరు రెండు రోజుల క్రితం ఇరాక్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంపై ఈ తెల్లవారుజామున జరిగిన రాకెట్ దాడిలో ఇరాన్, ఇరాక్కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాక్ మీడియా పేర్కొంది. విమానాశ్రయ కార్గోహాల్ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టాయి. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసిం సొలీమని ఉన్నట్టు ఇరాక్ మీడియా తెలిపింది. దాడి ఎవరు చేశారన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. రెండు రోజుల క్రితం ఇరాన్ మద్దతున్న కొంతమంది నిరసనకారులు ఇరాక్లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటనతో మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితుల ఉద్రిక్తంగానే మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ సహా దానికి మద్దతిస్తున్న దేశాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధం కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు తాజా దాడి అమెరికా పనేనని పీఎంఎఫ్ ఆరోపిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున ఖాసీం సోలెమన్ లెబనాన్ లేదా సిరియా నుంచి ఇరాక్కు ప్రత్యేక విమానంలో చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ముహందిస్ ప్రత్యేక కాన్వాయ్లో విమానాశ్రయానికి చేరుకున్నారన్నారు.
వీరినే లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడి జరిందని వెల్లడించారు. ఖాసీం విమానం దిగగానే రాకెట్ ఢీకొట్టినట్లు తెలిపారు. ఆయన చేతి వేలికున్న ఉంగరం ద్వారా మృతదేహాన్ని గుర్తించామన్నారు. గతంలోనూ ఖాసీం చనిపోయినట్లు వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఇరాక్కు అదనపు బలగాలను పంపించింది. ఆ వెంటనే ఈ దాడి జరగడం గమనార్హం.