తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకం అక్రమమా?, తెలంగాణ క్యాడర్ అధికారులను కాదని, ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్ అయిన సోమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవి కట్టబెట్టిందా ?? అంటే అవుననే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటోంది. నియమ, నిబంధనలకు విరుద్ధంగా 15 మంది సీనియర్ అధికారులను కాదని, సోమేశ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించిందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు .
సీనియర్ అధికారులు ఉన్నప్పుడు , వారిని కాదని రాష్ట్ర క్యాడర్ కు కూడా చెందని సోమేష్ కుమార్ కు సిఎస్ పదవి ఎలా కట్టబెడుతారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు . తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ లకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాధాన్యత కలిగిన పోస్టింగులు ఇవ్వడం లేదని ఆరోపించారు . ఇక సీఎం కార్యాలయం రిటైర్డ్ ఉద్యోగుల అడ్డాగా మారిందన్న ఆయన .. డజనుకు పైగా రిటైర్డ్ ఐఏఎస్ లు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు . సీఎస్ గా సోమేష్ కుమార్ నియామకం ఓ క్విడ్ ప్రోకో అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు .
టిఆర్ఎస్ కు సోమేష్ కుమార్ రాజకీయ లబ్ధి చేకూర్చారు కాబట్టే ఆయనకు సీఎస్ పదవి కట్టబెట్టారని అన్నారు . జిహెచ్ఎంసి ఎన్నికల్లో సోమేశ్ కుమార్ టిఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశారని , అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు సిఎస్ పదవి బహుమతిగా ఇచ్చారన్నారు . రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు . సోమేశ్ కుమారు కు ప్రభుత్ర ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలను కట్టబెడుతూ , మూడు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే . సీఎస్ రేసు లో అజయ్ మిశ్రా, శాంతికుమారి , అదార్హ్ సిన్హా, సోమేశ్ కుమార్ లు ప్రధానంగా పోటీ పడగా, ప్రభుత్వం సోమేశ్ వైపు మొగ్గు చూపింది .