పరిపాలనా సౌలభ్యం, పాలనా వికేంద్రీకరణ కోసం అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు, అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న అంశంలో దాదాపుగా ఒక నిర్ణయానికి జగన్ సర్కారు వచ్చింది. ఇదే విషయాన్ని రేపోమాపో అధికారికంగా ప్రకటించడానికి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం ఎమ్మెల్యేగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్దపతుంది. ఆ విధంగా అధికారాన్ని ఇరుకున పెట్టేందుకు ఎత్తులు వేస్తుంది. ఇదిలా ఉండగా రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు కూడా వ్యూహరచనల చేస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో హస్తినలో కమలనాధుల ఆలోచన విధానంతో వైకాపా వెన్నులో వణుకుపుడుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటు టిడిపి అటు బిజెపి అనుసరిస్తున్న ఈ పరిణామాలు  వైసిపి నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీలో జరిగిన పరిణామాలు తెలిసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

బిజెపి వ్యూహం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమరావతి రైతులను కలుసుకోవడం, వారికి హామీ ఇవ్వడం బిజెపి వ్యూహంలోని ఒక ముఖ్య భాగమనే  వైసిపి నాయకులకు అర్ధం అయింది. ఆ సందర్బంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అమరావతి రైతులకు  పటిష్టమైన హామీ ఇవ్వడం వైసిపి నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా మారింది. కిషన్ రెడ్డి అమరావతిపై స్పష్టమైన హామీ ఇవ్వడం వెనుక కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి జాతీయ నాయకుడు అమిత్ షా మంత్రాంగం ఉన్నదని వారికి తెలిసింది. ఊహించని ఈ పరిణామం వెనుక ఏం జరిగి ఉంటుందా అనే విషయం ఢిల్లీలో వైసిపి నాయకులు ఆరా తీస్తున్నారు. అమరావతి రైతులను హైదరాబాద్ లో కిషన్ రెడ్డి కలవడానికి ముందే కిషన్ రెడ్డికి అన్ని రకాల సమాచారాన్ని బిజెపి అధిష్టానం అందించి హామీ ఇవ్వాల్సిందిగా మార్గదర్శనం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ని గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్ విడుదల చేయడం, తదనంతర పరిణామాలలో కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని జాతీయ మ్యాప్ లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించేలా చేయడం తెలిసిన పరిణామాలే. 

డిఫెన్సులో పడిపోయింది..

అమరావతిని గుర్తిస్తూ దేశ మ్యాప్ లో మార్పులు చేసిన నాటి నుంచే వైసిపి ప్రభుత్వం డిఫెన్సులో పడిపోయింది. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడం తదితర పరిణామాలను బిజెపి నిశితంగా గమనించి తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని భావిస్తున్నది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై తన వైఖరి స్పష్టం చేయడం, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం తదితర అంశాలతో బిజెపి జాతీయ కమిటీ ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి రాజకీయ క్రీడను ఆరంభించింది. అందులో భాగంగానే కిషన్ రెడ్డితో హామీ ఇప్పించిందని బిజెపి వర్గాలు తెలిపాయి. ఇవన్నీ తెలుసుకున్న వైసిపి నాయకుల పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: