మహిళలు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తుండటాన్ని చూసి చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ఆవేదన వ్యక్తం చేశారు. దారిలో వెళ్తున్న ఆటోను ఆపి మరి ఎమ్మెల్యే రజిని మహిళా ప్రయాణికులకు స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. పండుగ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం 5 గంటల సమయం జరిగింది. చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్ర మాన్ని ముగించుకుని చిలకలూరిపేట వైపు వస్తున్నారు.
ఆమె తీవ్రంగా స్పందించారు..
పోలిరెడ్డిపాలెం దాటగానే చిలకలూరిపేట పట్టణం శివారులో ఒక ఆటో నిండుగా మహిళలు ప్రయాణిస్తుండటాన్నిఎమ్మెల్యే రజని గమనించారు. ఆ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. వెంటనే కారు ఆపారు. స్వయంగా ఎమ్మెల్యే ఆటో వద్దకు వెళ్లి నిలిపేశారు. ఆటోలో ఎంతమంది ఉన్నారో అందరూ కిందికి దిగాలని సూచించారు. ఒక్కొక్కరుగా అందరూ బయటకువచ్చారు. లెక్కేసి చూస్తే 18 మంది ఉన్నారు. అంతా మహిళలే. ఎమ్మెల్యే గారు అవాక్కయ్యారు. ఐదుగురు ప్రయాణించాల్సిన ఆటోలో 18 మంది ఉండటం ఏంటని డ్రైవర్ను ప్రశ్నించారు. డ్రైవర్ నుంచి సరైన సమాధానం రాలేదు. మహిళలతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇలా ప్రయాణించడం ఏ మాత్రం సురక్షితం కాదని, ఎప్పుడూ ఇలా చేయొద్దని సూచించారు. మీ కోసం మీ ఇంట్లో మీ బిడ్డలు ఎదురుచూస్తూ ఉంటారని, మీపైనే ఆధారపడి మీ కుటుంబం ఉందని ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడేలా ప్రయాణాలు చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తంచేశారు.
చాలా జాగ్రత్త..
పండుగ రోజుల్లో చాలా జాగ్రత్తగా ప్రయాణాలు ఉండాలని చెప్పారు. కీడు ఘడియలు వెంటాడుతూ ఉంటాయని, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహించాలని సూచించారు. అసలే చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సురక్షితంగా ప్రయాణాలు ఉండాలని చెప్పారు. ఆటోకు పరిమితికి మించి ప్రయాణాలు ఎక్కించకుండా చూడాలని అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. ప్రతి ఆటోకు కాపలా ఉండాలంటే సాధ్యం కాదని, జనాల్లో మార్పు రావాలని, పరిమితికి మించి ఆటోలు ఎక్కొద్దని మహిళలతో ఎమ్మెల్యే గారు అన్నారు. డ్రైవర్కు కూడా పలు సూచనలు చేశారు. పండుగ రోజుల్లో ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు లేకుండా చూడాలని పోలీసులకు చెప్పారు.