ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ రెండు మీడియా సంస్థలు పత్రికలు కొన్నిరోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ వరుస పత్రికా కథనాలు, టీవీ ఛానళ్లలో ప్రత్యేక ప్రసారాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు, ఛానల్స్‌ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు.

 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని ఆయన నేరుగా ఆయా మీడియా సంస్థల పేరు పెట్టి మరీ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. అమరావతిలో బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబు ఉచ్చులో పడవద్దని సూచించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతో ఏపీ బాగుపడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

అమరావతిలో చంద్రబాబు, టీడీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని.. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు కారణమని.. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

 

అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఘటన సీఎం జగన్‌దేనని అన్నారు. అమ్మ ఒడి కింద రూ.6,400 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: